హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 24 (నమస్తే తెలంగాణ): ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన ఎస్ఐబీ మాజీ అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నకు మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. ఏడురోజుల పోలీస్ కస్టడీలో భాగంగా ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్రావు ఇచ్చిన సమాచారంతో ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతయ్యను శనివారం పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఈ ఇద్దరితోపాటు కస్టడీ ముగిసిన ప్రణీత్రావును ఆదివారం నాంపల్లి కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వాదనలు విన్న మెజిస్ట్రేట్ అదనపు ఎస్పీలకు వచ్చే నెల 6 వరకు, ప్రణీత్రావుకు ఈ నెల 28 వరకు రిమాండ్ విధించారు. దీంతో ఆ ఇద్దరు అదనపు ఎస్పీలను కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు పంజాగుట్ట పోలీసులు సిద్ధమవుతున్నారు. ఎస్ఐబీలోని కంప్యూటర్లు, హార్డ్డిస్క్లు ధ్వంసం చేశాడనే కేసులో ప్రణీత్రావును అరెస్ట్ చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే.
ఏడు రోజుల వాంగ్మూలంలో ఇద్దరు ఏఎస్పీలతోపాటు ఒక మీడియా చానల్ నిర్వాహకుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు, హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీ రాధకిషన్రావుతోపాటు మరికొందరి పేర్లు వెల్లడించినట్టు తెలిసింది. ప్రణీత్రావు స్టేట్మెంట్ ఆధారంగా మరి కొందరు మాజీ పోలీసు అధికారులను నిందితులుగా చేరుస్తూ వారిని విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఆధారాల ధ్వంసంతోపాటు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు నిందితుల వద్ద నుంచి కొన్ని వాట్సాప్ చాటింగ్లను కూడా సేకరించినట్టు తెలిసింది.
ఉన్నతాధికారుల ఆదేశాలతోనే తాము పనులు చేశామంటూ నిందితులు చెప్పడంతో ఆయా ఉన్నతాధికారుల పాత్రపై దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. భుజంగరావు, తిరుపతన్న ఇచ్చిన నంబర్లను ట్యాపింగ్ చేసినట్టు ప్రణీత్రావు వెల్లడించడంతో ఆ ఇద్దరిని కూడా విచారించగా తమకు ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో ఆ నంబర్లు ఇచ్చినట్టు తెలిపారు. 17 హార్డ్డిస్క్లను కట్టర్తో ముక్కలు ముక్కలుగా కట్ చేసి, మూసీలో పడేయగా, డాక్యుమెంట్లను కాల్చేశామని ప్రణీత్రావు వెల్లడించారు.