సమాజంలో పాత్రికేయుల పాత్ర ఎప్పుడూ ప్రతిపక్షమేనని, ప్రజా సమస్యలు వెలికి తెచ్చి పరిష్కరింపజేయడం ఒక్క జర్నలిస్టులకే సాధ్యమని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. రవీంద్రభారతిలో ప్రముఖ పాత్రికేయుడు, ఆంధ్రపభ సంపాదకుడు పొత్తూరి వెంకటేశ్వరరావు స్మారక ఉత్తమ పాత్రికేయ పురస్కారం సీనియర్ పాత్రికేయుడు, ఇండియా టుడే మాజీ సంపాదకుడు ఎస్ వెంకట్ నారాయణకు ఆయన ప్రదానం చేశారు.
సీనియర్ పాత్రికేయుడు పాశం యాదగిరి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి పొత్తూరి వెంకటేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పరిపాలనలో అనుభవజ్ఞుల సూచనలు, సలహాలు తీసుకొని తమ ప్రభుత్వం ముందుకు వెళుతుందని పేర్కొన్నారు. వివిధ రంగాల్లో జాతీయ స్థాయిలో తెలుగువారి ప్రాధాన్యత తగ్గుతుందని, ఇది చాలా ప్రమాదకరమని, ఆ పరిస్థితి మారాల్సిన అవసరముందన్నారు.
తెలుగు రాష్ర్టాల నుంచి ఢిల్లీ స్థాయిలో ప్రభావితం చేసే వారిని ప్రోత్సహించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని వివరించారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్రెడ్డి, రామచంద్రమూర్తి, కె శ్రీనివాస్, సీఎం సలహాదారుడు వేం నరేందర్రెడ్డి, ప్రొఫెసర్ హరగోపాల్, పలువురు సీనియర్ పాత్రికేయులు, పొత్తూరి వెంకటేశ్వరరావు అభిమానులు పాల్గొన్నారు.