మంచిర్యాల : నవ మాసాలు మోసి.. కని పెంచిన తల్లి కళ్లెదుటే విగతజీవిగా మారడంతో తట్టుకోలేని ఓ కూతురు ఎడుస్తూనే హఠాన్మరణం చెందింది. ఈ విషాద ఘటన మంచిర్యాలలో ఆదివారం చోటు చేసుకున్నది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మైసలక్ష్మి, మల్లయ్యలు మంచిర్యాలలోని ఏసీసీలో గల అంబేద్కర్నగర్లో నివాసం ఉంటున్నారు. మల్లయ్య సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి. వీరికి ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లయ్యాయి. కాగా, వీరు పెద్ద కుమారుడు కుమారస్వామి, విజయలక్ష్మిలతోనే మంచిర్యాలలో ఉంటున్నారు.
కుమార స్వామి మంచిర్యాలలో ప్రైవేటుగా ఎలక్ట్రీషియన్గా, ఆయన భార్య విజయలక్ష్మి అంగన్వాడీ టీచర్గా ఏసీసీలో పనిచేస్తున్నారు. కూతురు సిలువేరు సరస్వతి అత్తవారిల్లు వరంగల్ కాగా, ఆమె మంచిర్యాలలో వెలుగులో సీఏగా పనిచేస్తూ ఏసీసీలోనే ఉంటున్నది. ఇదిలా ఉండగా, తనకు కడుపునొప్పిగా ఉందని మైస లక్ష్మి తన కోడలు విజయలక్ష్మికి శనివారం తెల్లవారుజామున చెప్పింది. దీంతో కుటుంబీకులు చికిత్స కోసం ఆమెను మంచిర్యాలలోని ఓ ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన చికిత్స కోసం కరీంనగర్కు రెఫర్ చేశారు.
దీంతో బాధితులు కడుపు నొప్పికి చికిత్స కోసం సుమారు మధ్యాహ్నం 3-4 గంటల ప్రాంతంలో అంబులెన్స్లో కరీంనగర్ బయలు దేరారు. లక్ష్మితో పాటు కూతురు సరస్వతి కూడా వెళ్లింది. కరీంనగర్కు సమీపానికి చేరుతుండగానే పరిస్థితి విషమించి లక్ష్మి మృతి చెందింది. దీంతో వారు తిరిగి బయలు దేరారు. మృతదేహం సాయంత్రం మంచిర్యాలకు చేరుకున్నది. కండ్లముందే తల్లి మృతి చెందడంతో సరస్వతి మనసు తల్లడిల్లింది. తట్టుకోలేక తల్లిమీద పడి బోరున ఏడుస్తూనే ఉన్నది. తెల్లవారు జామున స్పృహ సరస్వతి కోల్పోయింది. గమనించిన కుటుంబీకులు వెంటనే అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. సత్వర వైద్యం కోసం మంచిర్యాలలోని ఓ ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లారు.
కాగా, ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తల్లీ కూతుళ్ల మృతి సంఘటన మంచిర్యాల జిల్లాలో విషాదం నింపింది. తల్లీ కూతుళ్ల మృతితో బంధువుల రోదనలు మిన్నంటాయి. కాగా, లక్ష్మికి అంత్యక్రియలు ఏసీసీలోని అంబేద్కర్ నగర్లో ఆదివారం మధ్యాహ్నం నిర్వహించారు. సరస్వతి మృతదేహాన్ని అత్తవారిళ్లయిన వరంగల్కు తరలించారు. ఆమె అంత్యక్రియలు కూడా ఆదివారం పూర్తయ్యాయి. కాగా, సరస్వతి భర్త సిలువేరు భద్రయ్య వరంగల్లో ప్రైవేటు టీచర్ పని చేస్తున్నాడు.