వీణవంక/జమ్మికుంట, సెప్టెంబర్ 8 : దళితబంధు యూనిట్లు ఉన్నవారికే ఇస్తున్నారని, లేనివారికి ఇవ్వడంలేదని దళితజాతిపై బీజేపీ నాయకుడు, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై దళిత సంఘాల నాయకులు భగ్గుమన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని గాంధీ చౌరస్తా, వీణవంక బస్టాండ్ ఆవరణలో ధర్నా నిర్వహించి, ఈటల దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దళితుల బతుకుల్లో వెలుగులు నింపాలనే ఆలోచనతో దేశంలో ఎక్కడాలేని విధంగా దళితబంధు పథకాన్ని ప్రారంభించి, పారదర్శకంగా అమలు చేస్తున్నారని తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికే 90 శాతం దళిత కుటుంబాలకు యూనిట్లు అందజేశారని చెప్పారు. ఓ వైపు దళితులు యూనిట్లు తీసుకొని ఆర్థికాభివృద్ధి చెందుతుంటే.. కొందరికే ఇస్తున్నారంటూ ఈటల మాట్లాడటం తగదన్నారు.
దళితులపై నిజంగా ప్రేమ ఉంటే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దళితబంధు ఇవ్వాలని, బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనూ ఈ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆయా కార్యక్రమాల్లో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్రావు, టీఆర్ఎస్ జమ్మికుంట అర్బన్ అధ్యక్షుడు టంగుటూరి రాజ్కుమార్, వీణవంక ఉప సర్పంచ్ వోరెం భానుచందర్, దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు.