కరీంనగర్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): దళితబంధు ఫలాలు లబ్ధిదారులకు అందుతున్నాయి. నిన్నటిదాకా డ్రైవర్గా ఉండి.. దళితబంధు సాయంతో కారు ఓనర్గా మారిన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండ లం శాయంపేటకు చెందిన శంకర్ నెలకు రూ.25 వేలు పొందుతున్నాడు. గతంలో నెలకు రూ.8 వేల జీతమే రాగా.. ఇప్పుడు పాతికవేలు వస్తుండటంతో ఆయన కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తున్నది. దళితబంధు పథకాన్ని ప్రారంభించిన గతనెల 16న సీఎం కేసీఆర్ చేతులమీదుగా రూ.10 లక్షల మంజూరు పత్రం అందుకున్న 15 మందిలో శంకర్ ఒకరు. అప్పటికి డ్రైవర్గా పనిచేస్తున్న ఆయన పథకం లబ్ధిదారుగా కారును అద్దెకు నడపడం యూనిట్గా ఎంచుకున్నారు. గత నెల 26న మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఈ వాహనాన్ని శంకర్ దంపతులకు అందజేశారు. కారును స్థానిక జడ్పీటీసీ శ్రీరాంశ్యాం నెలకు రూ.25 వేలకు అద్దెకు తీసుకున్నారు. కారు తీసుకున్న నెల రోజుల్లోనే రూ.25 వేలు సంపాదించుకొనే అవకాశం రావడంతో సంతోషం పట్టలేకపోతున్నానని శంకర్ చెప్తున్నారు.
సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న దళిత బంధు పథకం నిరుపేద దళితులకు ఎందుకు అవసరమో శంకర్ కుటుంబాన్ని చూస్తే తెలిసిపోతుంది. డ్రైవర్గా శంకర్ నెలకు సంపాదించే ఏడెనిమిది వేలతో అతని కుటుంబంలోని ఆరుగురు వ్యక్తులు బతకాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు రూ.25 వేలతో హాయిగా బతుకుతామని ఈ కుటుంబం దీమా వ్యక్తంచేస్తున్నది. సీఎం కేసీఆర్ చేతులమీదుగా మంజూరుపత్రాలు అందుకున్న మిగతా 14 మంది కూడా పలు యూనిట్లు తీసుకుని ఆర్థికంగా లబ్ధిపొందుతున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని సుమారు 21 వేల కుటుంబాలు స్ఫూర్తిగా తీసుకుంటున్నాయి. ఇప్పటికే అర్హులైన 14,371 దళిత కుటుంబా ఖాతాల్లో నగదు జమచేశారు. అధికారులు వారిమధ్యే ఉంటూ ఎంచుకునే యూనిట్లపై అవగాహన కల్పిస్తున్నారు. కొన్ని సంస్థలు ఇందులో భాగస్వామ్యం అవుతున్నాయి. మంచి యూనిట్ను ఎంచుకుని.. స్థిరపడాలనే లక్ష్యంతో దళిత కుటుంబాలు ఉన్నాయి.
నిరుపేద దళిత కుటుంబానికి చెందిన నేను నా జీవితంలో కారు కొనుక్కుంటానని అనుకోలే. డ్రైవింగ్ నేర్చుకొని ప్రైవేటు డ్రైవర్గా పనిచేస్తే నెలకు ఏడెనిమిది వేలు వచ్చేవి. భార్య, పదో తరగతి చదువుతున్న పాప, 8 చదువుతున్న బాబు, తల్లిదండ్రులు ఉన్నారు. డ్రైవర్గా పనిచేసి సంపాదించే జీతం సరిపోక ఇబ్బందులు పడ్డ సమయంల సీఎం కేసీఆర్ దళితబంధు తీసుకొచ్చి, హుజూరాబాద్లనే ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నరని తెలిసి మస్తు సంతోషపడ్డ. ఎట్లనైనా కారు కొనుక్కోవల్ననే నా కలను నిజం చేసుకున్న. సీఎం సార్ మాకు పది లక్షల మంజూరు పత్రం ఇచ్చిండ్రు. దీంతో నేను ఓ కారుకు ఓనరునైన. నాలుగైదు రోజులు కిరాయికి తిప్పాక.. మా జడ్పీటీసీ డాక్టర్ శ్రీరామ్ శ్యామ్ ఎంగేజ్కు తీసుకున్నరు. పెట్రోల్ ఖర్చులు ఆయనే భరిస్తూ నెలకు ఇరవై ఐదు వేలు ఇస్తమన్నరు. సంతోషంగా ఒప్పుకున్న. దళితబంధు పథకం కింద పది లక్షలు ఇచ్చిన కేసీఆర్ సార్కు జీవితాంతం నేను, నా కుటుంబం రుణపడి ఉంటది.