కరీంనగర్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): దళితులను ధనవంతులను చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజక వర్గంలో సత్ఫలితాన్ని ఇస్తున్నది. హుజూరాబాద్ పట్టణానికి చెందిన గన్నారపు అరుణ, పెరుక హేమలత అనే అక్కాచెల్లెళ్లు ఈ పథకం కింద ఏకంగా ఆర్టీసీ అద్దె బస్సు (సెకండ్ హ్యాండ్)ను కొనుగోలు చేయడమే ఇందుకు నిదర్శనం. దళితబంధు కింద వారికి వచ్చిన తలా రూ. 10 లక్షలు పోనూ మరో రూ. 10 లక్షల రుణంతో కలిపి రూ.30 లక్షలతో కొనుగోలు చేసుకున్న అద్దె బస్సును గురువారం కరీంనగర్ బస్టేషన్లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్.. లబ్ధిదారులకు అందజేశారు. ఆర్టీసీ అద్దె బస్సు సిరిసిల్ల-వరంగల్ రూట్లో నడుస్తుండగా.. సదరు యజమాని విక్రయిస్తున్నట్టు తెలుసుకొన్న అరుణ, హేమలత తమకు దళితబంధు కింద వచ్చిన డబ్బుతో కొనుగోలు చేసుకుంటామని అధికారులకు ప్రతిపాదించారు.
బస్సు కండిషన్ పరిశీలించిన అధికారులు ఇందుకు సమ్మతించడంతో కొనుగోలు చేశారు. సిరిసిల్ల నుంచి కరీంనగర్ మీదుగా వరంగల్ వరకు నడిచే ఈ బస్సుకు నెలకు దాదాపు రూ.3.20 లక్షల వరకు ఆర్టీసీ చెల్లిస్తున్నది. ఇద్దరు డ్రైవర్ల వేతనాలు, సర్వీసింగ్ చార్జీలు, డీజిల్ ఖర్చులు పోనూ ప్రతి నెలా వీరికి రూ.65 వేల నుంచి రూ. 70 వేల వరకు ఆదాయం వస్తుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
కేసీఆర్ వల్లే బస్సు యజమానులుగా మారాం
లబ్ధిదారులు అరుణ, హేమలత మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తమ పాలిట దేవుడని కొనియాడారు. ఉన్న కొద్ది భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవించే తమను ఒక బస్సుకు యజమానులను చేశారని సంతోషం వ్యక్తం చేశారు. తన భర్త చనిపోవడంతో జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కొన్నానని, ఇప్పుడు కేసీఆర్ సార్ బస్సు ఇవ్వడంతో వచ్చిన ఆదాయంతో కష్టాలు తీరుతాయని అరుణ ఆనంద బాష్పాలు రాల్చింది.