హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): వృక్షో రక్షతి రక్షితః అనే నినాదం స్ఫూర్తితో సైబరాబాద్ పోలీసులు వృక్షాలను సంరక్షిస్తున్నారు. గడిచిన ఆరు నెలల్లో వృక్ష సంపదను కాపాడేందుకు తీసుకొన్న ప్రత్యేక చర్యలను శుక్రవారం సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. 26 కేసులు నమోదు చేసి.. చెట్ల నరికివేత, కలప అక్రమ రవాణాకు చెక్ పెట్టామని వివరించారు. 6 నెలల కాలం లో శంషాబాద్ జోన్ పరిధిలోని అమనగల్, కడ్తాల్, శంషాబాద్, షాద్నగర్ పరిధిలో ఉన్న వృక్ష సంపద నరికి కలప వ్యాపారం చేస్తున్న వారిపై 26 కేసులు నమోదు చేశామని, 36 మందిని అరెస్టు చేసినట్టు వివరించారు. 26 భారీ వాహనాలతోపాటు 250 టన్నుల కలపను స్వాధీనం చేసుకొని అటవీ శాఖకు అప్పగించినట్టు చెప్పారు. కలప అక్రమ వ్యాపారులపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తున్నట్టు తెలిపారు.
వ్యక్తులుగానీ కంపెనీలకు సంబంధించినవారుగానీ పట్టా భూములు, అసైన్డ్, అద్దె భూముల్లోని చెట్లను నరకాల్సి వస్తే టీఎస్-ఐపాస్ రూల్స్ ద్వారా అనుమతి తీసుకోవాలని సీపీ తెలిపారు. అక్రమంగా చెట్లు నరికితే జైలు శిక్ష తప్పదని సీపీ హెచ్చరించారు.