హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): వానొస్తేనే వరద వచ్చేది.. వరదొస్తేనే సాగునీళ్లొచ్చేది. ఏరువాక సాగాలంటే మొగులు కురవాల్సిందే. సీజన్ దాటినా వానమ్మ పలుకరిస్తేనే ఏరువాక సాగేది. నిన్నటిదాకా రాష్ట్రంలో వ్యవసాయం పరిస్థితి ఇది! ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతున్నది. కాలం కాకపోయినా కాలువల్లో నీళ్లు పారనున్నాయి. వర్షాలు కురియకపోయినా సమయానికే విత్తనాలు పడనున్నాయి. సీఎం కేసీఆర్ భగీరథ సంకల్పం ఫలితంగా రాష్ట్రంలోని ఆయకట్టు మొత్తాన్ని త్వరలో స్థిరీకరించనున్నారు. వర్షాలు పడినా.. పడకున్నా సమయానికి ఆయకట్టుకు సాగునీరందనున్నది. కాళేశ్వరం, పాలమూరు- రంగారెడ్డితోపాటు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు సాగునీటి ప్రాజెక్టుల ఫలితంగా ఇది ఆవిష్కృతం కానున్నది. స్వరాష్ట్రం సిద్ధించే నాటికి తెలంగాణలో గోదావరిపై ఎస్సారెస్పీ మినహా మరే ఇతర సాగునీటి ప్రాజెక్టు లేదు. కృష్ణానదిపై శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు ఎప్పుడు నిండుతాయో తెలియని పరిస్థితి. జూరాల, ఎల్ఎండీ ప్రాజెక్టుల సామర్థ్యం చాలా తక్కువ. దీంతో అటు గోదావరి ఇటు కృష్ణా మధ్యలో ఉన్నా తెలంగాణ ఎడారిగానే మారింది. తెలంగాణ ఏర్పడేనాటికి శ్రీశైలం, నాగార్జునసాగర్ మినహా.. రాష్ట్రంలోని ఇతర రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం 200 టీఎంసీలు మాత్రమే. ఇందులో ఎస్సారెస్పీ సామర్థ్యం 90 టీఎంసీలే అయినా.. 30-40 టీఎంసీలకు మించి నీళ్లు చేరిన రోజులు చాలా తక్కువ.
తెలంగాణను కోటిన్నర ఎకరాల మాగాణంగా మార్చాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయడంతోపాటు, ప్రారంభంకాని ప్రాజెక్టులను రీడిజైన్ చేశారు. రికార్డు సమయంలో కాళేశ్వరం పథకాన్ని నిర్మించారు. మిషన్ కాకతీయతో చెరువులను పునరుద్ధరించారు. రిజర్వాయర్లను నిర్మిస్తూ, పునరుజ్జీవ పథకాలను చేపట్టి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద సుమారు 300కుపైగా టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఏర్పడింది. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంతో మరో 90 టీఎంసీలు కలిసి వచ్చింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే మరో 80 టీఎంసీలను నిల్వ చేసుకొనే అవకాశం లభిస్తుంది. వీటికి చెరువులు అదనం. అన్ని ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే తెలంగాణలో 550-600 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం వస్తుంది. అప్పుడు రాష్ట్రంలోని కోటిన్నర ఎకరాల సాగునీటికి, ప్రజల తాగునీటికి పుష్కలంగా సరిపోతాయని అధికారులు పేర్కొంటున్నారు.
తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ నిండితే సీజన్తో సంబంధం లేకుండా సమయానికి కాలువలు, చెరువుల ద్వారా సాగునీటిని అందించవచ్చని నీటిపారుదలశాఖ అధికారులు చెప్తున్నారు. ఒకట్రెండు సీజన్లపాటు వర్షాలు సరిగా పడకపోయినా ఎలాంటి ఇబ్బంది ఉండదని పేర్కొంటున్నారు. మరోవైపు ప్రాజెక్టులను ‘స్మార్ట్’గా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ‘డెసిషన్ సపోర్ట్ సిస్టమ్’ పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నది. ఆయకట్టులో పంట రకం, నేల రకాన్ని బట్టి నీటి విడుదల జరుగుతుంది. సీజన్లో వర్షపాతాన్ని అంచనావేసి, నీటి అవసరం, ప్రాజెక్టుల్లో నిల్వను బట్టి ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని సేకరిస్తుంది.