హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం కోటి ఎకరాలకు దాటింది. దాదాపు నెల రోజులపాటు కురిసిన భారీ వర్షాలు తగ్గుముఖం పట్టడంతో రైతులు పంటల సాగును ముమ్మరం చేశారు. ఈ ఏడాది 1.43 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకొన్నది. పత్తి ప్రతిపాదిత సాగు లక్ష్యం 70 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 48.29 లక్షల ఎకరాల్లో సాగైంది. కంది ప్రతిపాదిత సాగు లక్ష్యం 15 లక్షల ఎకరాలు కాగా, 5.47 లక్షల ఎకరాల్లో సాగు చేశారు.
సోయాబీన్ సాధారణ సాగు లక్ష్యం 3.88 లక్షల ఎకరాలు కాగా, 3.85 లక్షల ఎకరాల్లో వేశారు. వరి ప్రతిపాదిత సాగు లక్ష్యం 45 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 34.95 లక్షల ఎకరాల్లో సాగు చేసినట్టు వ్యవసాయశాఖ వెల్లడించింది. మొకజొన్న సాధారణ సాగు లక్ష్యం 8.18 లక్షల ఎకరాలు కాగా, 5.04 లక్షల ఎకరాల్లో సాగైంది. ఎనిమిది జిల్లాల్లో వంద శాతానికి మించి పంటలు సాగయ్యాయి. 28 జిల్లాల్లో 50 శాతానికి మించి పంటలు సాగయినట్టు అధికారులు తెలిపారు.