PRLIS | కృష్ణమ్మ.. ఏండ్లుగా పాలమూరు బీళ్లను తడపకుండానే పరుగుపెట్టింది.. తుంగభద్ర.. కరువుసీమను కన్నెత్తిచూడకుండానే తరలిపోయింది.. బీమా.. నడిగడ్డకు ధీమా ఇవ్వలేకపోయింది.. దుందుభి నాదమే వినిపించకుండా పోయింది.. వెరసి నడిగడ్డపై కరువు.. ఆకలి.. వలసలు.. క్లుప్తంగా చెప్పాలంటే జీవనవిధ్వంసం. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు మారినా ఆ బతుకులు మారలేదు. తాగు, సాగునీటికి తండ్లాట తప్పలేదు. ఏలికలే దత్తత తీసుకున్నా జిల్లా దరిద్రం మాసిపోలేదు. కానీ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ విజన్తో నదీజలాలు ఎదురెక్కుతూ.. చెరువులు తడలుగొడుతూ.. వాగులు జాలువారుతూ..
ఎండిన చేల తరాల దాహార్తిని తీర్చుతున్నాయి. కరువుసీమపై పచ్చదనాన్ని పరుస్తున్నాయి. ఇప్పుడు పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తితో ఒక్క ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే 20 లక్షల ఎకరాలకు సాగునీరందనుండటం, అది తెలంగాణలో ఏ ఉమ్మడి జిల్లాతో పోల్చి చూసినా అత్యధికం కావడం విశేషం. ఇది తెలంగాణ సాధించిన ఈ శతాబ్దపు అద్భుత విజయం.
(మ్యాకం రవికుమార్)
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి పాలమూరు జిల్లా తెలంగాణలోనే అతిపెద్ద జిల్లా. దాదాపు 35 లక్షల ఎకరాలకుపైగా సాగుకు యోగ్యమైన భూములున్న జిల్లా. అందులోనూ సారవంతమైన ఎర్ర, నల్లరేగడి భూములు. ఒక పక్క కృష్ణమ్మ.. మరో పక్క తుంగభద్ర.. ఇంకోపక్క బీమా.. దుందుభి.. చెప్పుకుంటూ ఎన్నో అపారమైన నీటి వనరులు. కోనసీమగా విలసిల్లాల్సిన పాలమూరు నాటి పాలకుల పట్టింపులేమితో కరువుకు నెలవైంది. వలసల జిల్లా అనే పేరును మూటగట్టుకున్నది. దేశవ్యాప్తంగా అత్యంత వెనకబడిన జిల్లాలుగా 9 గుర్తిస్తే అందులో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఒకటిగా నిలిచిందంటే ఎంత దుర్భిక్ష పరిస్థితి నెలకొన్నదనేది అర్థం చేసుకోవచ్చు. 40 లక్షలు గల జిల్లా జనాభాలో సగానికిపైగా మంది పొట్టచేతపట్టుకొని వలస పోవాల్సిన దుస్థితి. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు మారారు. జిల్లాను దత్తత తీసుకున్నవారు ఉన్నారు. అయినా కరువు పోలేదు. నడిగడ్డ బతుకులు మారలేదు. వలసలు ఆగలేదు. ఆకలి చావులు ఆగిపోలేదు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాలమూరు ప్రజల గోస ఓ రణ నినాదమైంది. ఆ పోరు నుంచి ఆవిర్భవించిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ఇప్పుడు పాలమూరు దశ మారుతున్నది. పాలమూరు ప్రగతి రథాన్ని సీఎం కేసీఆర్ సారథిగా ముందుకు తీసుకెళ్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న బహుముఖ వ్యూహాలతో స్వరాష్ట్రంలో పాలమూరు ముఖచిత్రమే మారిపోతున్నది. ప్రస్తుతం ప్రారంభానికి సిద్ధమైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో నడిగడ్డ సాగులో రాష్ట్రంలోనే మేటిగా ఎదగనున్నది.
వడివడిగా పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి
కల్వకుర్తి, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం సర్వే కోసం 1984లో ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం ఐదేండ్లకు ఆ ప్రాజెక్టుల సర్వే కోసం ఒక సరిల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. 1997లో సర్వే కోసం రూ.50 లక్షలు మంజూరు చేశారు. 1999లో పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. 2003లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, 2003లో పనులు ప్రారంభించారు. మొత్తంగా ప్రాజెక్టు సర్వేకు 1984లో జీవో జారీ చేస్తే 20 ఏండ్ల తర్వాత ఎన్నికల ముందు, తెలంగాణ జెండా ఎత్తిన అనంతరం పనులు ప్రారంభించారు. అయినా తెలంగాణా రాష్ట్రం ఏర్పడే దాకా అంటే పదేండ్లయినా పనులు పూర్తి చేయలేదు. నిధుల కొరత, భూసేకరణ, అటవీ అనుమతులు, రైల్వే, రోడ్డు క్రాసింగ్, అంతర్రాష్ట్ర వివాదాలు, కాంట్రాక్టు సంస్థలతో వివాదాలు, కోర్టు కేసులు తదితర సాకులు చూపెడుతూ ప్రాజెక్టులను మూలకునెట్టారు. ఇదీ ఉమ్మడిపాలనలో తెలంగాణ ప్రాజెక్టుల దుస్థితి.
అదీగాక ఎత్తిపోతల పథకాల్లో సంక్లిష్టమైన పంప్హౌజ్ , సర్జ్పూల్ల నిర్మాణం, పంపులు, మోటర్ల బిగింపు, విద్యుత్తు సరఫరాకు సబ్ స్టేషన్లు, ట్రాన్స్మిషన్ లైన్ల నిర్మాణం, డిస్ట్రిబ్యూటరీ కాలువల తవ్వకానికి అవసరమైన భూసేకరణ పూర్తిగా చేపట్టలేదు. ఇలాంటి అనేక సవాళ్లున్నా రాష్ట్ర ఏర్పాటు అనంతరం పాలమూరు జిల్లా బీడు భూములన్నింటినీ తడపాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టారు. అటకెకిన ప్రాజెక్టుల దుమ్ము దులిపారు. ఇంజినీరింగ్ నిపుణులతో కూలంకషంగా సమీక్షించి, సమస్యలను పరిషరించారు. క్షేత్రస్థాయిలో తిరుగుతూ నిరంతర పర్యవేక్షణతో, ప్రాధాన్యత క్రమంలో నిధులను సమకూర్చుతూ, అవసరమైన అనుమతులను సత్వరమే జారీ చేస్తూ పెండింగ్ ప్రాజెక్టుల పనులను పరుగులు పెట్టించారు. కేవలం రెండేండ్లలోనే మహబూబ్నగర్ పెండింగ్ ప్రాజెక్టు పనులు 50 శాతం నుంచి 95 శాతానికి చేరుకోవడం సీఎం కేసీఆర్ అకుంఠిత దీక్షకు అద్దంపడుతున్నది. 2016-17 వరకే ప్రాజెక్టులను పూర్తిచేసి దాదాపు 5 లక్షల ఎకరాలకు సాగునీరందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. క్రమంగా డిస్ట్రిబ్యూటరీల పనులను పూర్తి చేస్తూ నేడు ప్రాజెక్టుల కింద నికరంగా 10 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీటిని అందిస్తుండడంతో పాలమూరు సాగునీటి గోస తీరింది.
‘పాలమూరు’తో మహర్దశ..
తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు ఎత్తిపోతలతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్వరూపమే మారిపోనున్నది. ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి జిల్లాలో అదనంగా 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. రాష్ట్ర ఏర్పాటు అనంతరం పెండింగ్ ప్రాజెక్టులతోపాటు గత ప్రభుత్వం ఆమోదించి అటకెకించిన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కూడా సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టును అడ్డుకునేందుకు బయటి, రాష్ట్రంలోని అంతర్గత శత్రువుల కుటిల పన్నాగాలను తిప్పికొట్టి అనుమతులు సాధించారు. పనులు వడివడిగా పూర్తి చేస్తూ మహబూబ్నగర్ జిల్లా ప్రజల సాగునీటి ఆకాంక్షలను నెరవేర్చేందుకు తెలంగాణ సర్కారు కీలక అడుగులు వేస్తున్నది. ప్రాజెక్టు పూర్తికానుండడంతో ఆంధ్రతో విలీనం వల్ల ఉమ్మడి మహబూబ్నగర్ నష్టపోయిన ప్రాంతాలు ఇప్పుడు సస్యశ్యామలం కానున్నాయి. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 7 లక్షల ఎకరాలకు, ఇదే ప్రాజెక్టును ఆధారంగా చేసుకుని నిర్మిస్తున్న ఉమామహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద అచ్చంపేట నియోజకవర్గంలో అదనంగా మరో 84వేల ఎకరాలకు నీరందనున్నది. వెరసి ఇప్పటికే పూర్తయిన పెండింగ్ ప్రాజెక్టుల కింద ఆయకట్టును కలుపుకొంటే మొత్తంగా ఒక్క ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే 20 లక్షల ఎకరాలకు సాగునీరందనున్నది. ఇది తెలంగాణలో ఏ ఉమ్మడి జిల్లాతో పోల్చి చూసినా అత్యధికం కావడం విశేషం. ప్రాజెక్టు ద్వారా మొత్తంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లోనే 10 నియోజకవర్గాలకు నేరుగా లబ్ధి చేకూరనున్నది.
చెరువుల పునరుద్ధరణతో మరింత ఊతం
ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక చెరువులున్న జిల్లా పాలమూరే కావడం విశేషం. వలస పాలనలో పూర్తిగా నిర్వీర్యమైన చెరువుల వ్యవస్థ పునరుద్ధరణకు సీఎం కేసీఆర్ ‘మిషన్ కాకతీయ’ పథకానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మహబూబ్నగర్ జిల్లాలో చెరువులను పునరుద్ధరించారు. వాటిని ఎత్తిపోతల పథకాలతో అనుసంధానించారు. ఫలితంగా చెరువుల్లో ఏ కాలంలోనైనా నీటివనరులకు ఢోకా లేకుండా పోయింది. 30 ఏండ్ల తర్వాత కాకతీయులు నిర్మించిన గణపసముద్రం చెరువు కల్వకుర్తి నీటితో నిండి అలుగు పారడమే అందుకు సాక్ష్యం. పాలమూరు జిల్లాలో చెరువుల కింద మొత్తం ఆయకట్టు 2.7 లక్షల ఎకరాలుండగా 2014కు ముందు కనీసం 50 ఎకరాలు సాగులోకి రావడం కష్టంగా ఉండేది. నేడు చెరువుల కింద ఉన్న మొత్తం ఆయకట్టు స్థిరీకరణ పొందడం విశేషం. అదీగాక వాగులపై చెక్డ్యామ్ల నిర్మాణంతో.. 24గంటల నిరంతర విద్యుత్తు సరఫరావల్ల ఐడీసీ లిఫ్ట్లు పనిచేయడం ఫలితంగానూ అదనంగా దాదాపు 50వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. నీటి సంరక్షణ చర్యల ఫలితంగా పాలమూరు గ్రామాలు జలకళను సంతరించుకొన్నాయి. భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. వనపర్తి జిల్లానే అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నది.
స్వరాష్ట్రంలో పదేండ్లలో ఆయకట్టు
స్వరాష్ట్రం పదేండ్లలో ఇప్పటికే పెరిగిన ఆయకట్టు శాతం 28.37
రెండేండ్లలోనే పూర్తయిన ప్రాజెక్టుల కింద పారకం
ప్రాజెక్టు అందిన సాగునీరు