హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగం ఎగ్జామ్ రాసిన విద్యార్థుల నోట వినిపిస్తున్న ఒకే మాట కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ). హాట్టాపిక్గా మారిన ఈ కోర్సుకు ఏటా తీవ్ర డిమాండ్ ఉంటున్నది. ఈ విద్యాసంవత్సరం సీఎస్ఈ కోర్సులో 28,435 సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఐఏసీటీఈ) అనుమతినిచ్చింది. అనుబంధ కోర్సుల్లో మరో 25,890 సీట్లకు అనుమతులు మంజూరుచేసింది. మొత్తంగా సీఎస్ఈతోపాటు సీఎస్ఈ అనుబంధ కోర్సుల్లోనే 54,325 సీట్లు ఉన్నాయి. అనుబంధ కోర్సులు తీసుకొంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్లో 13,740, సీఎస్ఈ డాటాసైన్స్లో 8,910, సీఎస్ఈ సైబర్ సెక్యూరిటీలో 3,240 సీట్లకు ఏఐసీటీఈ అనుమతినిచ్చింది. 2022 -23 విద్యాసంవత్సరానికి మొత్తంగా 1,11,147 సీట్లకు ఐఏసీటీఈ ఆమోదం తెలిపింది. ఈ కోర్సులు, సీట్లకు జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీలు ఆమోద ముద్రవేయాల్సి ఉంటుంది. ఆమోదం లభించిన సీట్లను ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీచేస్తారు. ఈ ఏడాది 168 కాలేజీలకు అనుమతి లభించింది. కొత్తగా వనపర్తిలో ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటైంది.
ఇటీవల సాఫ్ట్వేర్ అవసరం లేకుండా ఏ రంగం పనిచేయడం లేదు. మెడికల్, ఫార్మా, ఉత్పాదక రంగం ఏదీ తీసుకున్నా సాఫ్ట్వేర్ రంగం అత్యధికంగా ప్రభావితం చేస్తున్నది. దీంతో ఇంజినీరింగ్లో ఏ కోర్సు పూర్తిచేసినా అత్యధికులు సాఫ్ట్వేర్ రంగం వైపే చూస్తున్నారు. ఐటీ రంగం రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతుండటం, ద్వితీయ శ్రేణి నగరాల్లోను ఐటీ పార్క్లు ఏర్పాటవుతుండటంతో అవకాశాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఏ బ్రాంచి చదివినవారైనా ఐటీ రంగంలోనే స్థిరపడాల్సి ఉండటం, ఈ రంగంలోనే ప్లేస్మెంట్స్ అధికంగా ఉండటం, భారీ ప్యాకేజీలు లభిస్తుండటం, వేగంగా కెరీర్లో స్థిరపడే అవకాశాలుండటంతో విద్యార్థులు సీఎస్ఈ కోర్సు వైపు ఆకర్షితులవుతున్నారు. ఇటీవల స్టార్టప్ కల్చర్ వేగవంతమవుతుండటం సైతం సీఎస్ఈ కోర్సుకు డిమాండ్ పెరిగేందుకు కారణమవుతున్నది.
ఈ ఏడాది బీటెక్ ఫస్టియర్ క్లాసులు నవంబర్ ఒకటి నుంచి ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. తరగతులను అక్టోబర్ 10 నుంచి ప్రారంభించాల్సి ఉన్నా.. ఐఐటీల్లో సీట్ల భర్తీకి నిర్వహించే జ్యోసా కౌన్సెలింగ్ ఆలస్యంగా జరిగే అవకాశముండటంతో ఎంసెట్ సీట్ల భర్తీ సైతం ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలోనే నవంబర్ ఒకటి నుంచి ఫస్టియర్ క్లాసులను ప్రారంభించే అవకాశమున్నట్టు సాంకేతిక విద్య కమిషనర్ నవీన్మిట్టల్ తెలిపారు.