హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో వ్యవసాయం బ్రహ్మాండంగా సాగుతున్నదని, రాష్ట్రంలో దశలవారీగా 20 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేయాలని నిర్ణయించినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ పేర్కొన్నారు. ఆయిల్పామ్ సాగులో పరస్పరం సహకరించుకొందామని, తెలంగాణ చేపట్టిన ‘మిషన్ ఆయిల్పామ్’ ప్రాజెక్ట్కు మద్దతు ఇవ్వాలని మలేషియా బృందాన్ని ఆయన కోరారు. గురువారం నగరానికి వచ్చిన ఈ బృందం బీఆర్కే భవన్లో సీఎస్తో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆయిల్పామ్ విస్తరణకు అవసరమైన విత్తనాల సరఫరాను వేగవంతం చేయాలని, సాగుకు అవసరమైన శిక్షణకు సహకరించాలని కోరారు. తెలంగాణ యువతకు మలేషియా ఆయిల్పామ్ సెక్టార్లో ఉపాధి కల్పించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మలేషియా ఆయిల్పామ్ కౌన్సిల్ సీఈవో వాన్ ఐషా వాన్ హమీద్, రజాక్, రుచి శ్రీవాస్తవ, మలేషియన్ ఆయిల్పామ్ బోర్డు డీజీ అహ్మద్ పర్వీజ్ గులామ్, తెలంగాణ భవన్ ఓఎస్డీ సంజయ్జాజు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు తదితరులు పాల్గొన్నారు.