హైదరాబాద్ : ‘మంచి పుస్తకం మన చెంత ఉంటే మంచి మిత్రుడు లేని లోటు తీరినట్లే’నన్న గాంధీ చెప్పిన సూక్తిని యువతరం ఆకలింపు చేసుకొని, పుస్తక పఠనం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ పిలుపునిచ్చారు. వజ్రోత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్ దేశాల మేరకు రాష్ట్ర సాహిత్య అకాడమీ, భాషా సాంస్కృతిక శాఖ సంయుక్తంగా ప్రత్యేక పుస్తక ప్రదర్శనను ఎల్బీ స్టేడియం టెన్నిస్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేశాయి. డీజీపీ మహేందర్రెడ్డి, ఇతర సీనియర్ అధికారులతో కలిసి సీఎస్ సోమేశ్ సందర్శించారు.
ఈ సందర్భంగా సోమేశ్కుమార్ మాట్లాడుతూ.. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ సంకల్పం మేరకు ద్విసప్తాహ కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయన్నారు. వజ్రోత్సవాల సందర్భంగా గాంధీ ఆశయాలను, భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేసే కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వజ్రోత్సవ పుస్తక ప్రదర్శన మంచి సందేశాన్ని సమాజానికందించిందని తెలిపారు. ఈ తరంలోకి గాంధీ భావాలను తీసుకుపోవాలన్న కేసీఆర్ ఆలోచనలకు ప్రతీకగా పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేయడాన్ని అభినందించారు.
అంతకు ముందు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్టాల్స్ను సందర్శించారు. ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గాంధీ చరకాను, చేనేత మగ్గాన్ని, ఎద్దు గానుగ యంత్రాన్ని ఆసక్తిగా తిలకించారు. పుస్తక ప్రదర్శనను చక్కగా ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఆయన అభినందించారు. అనంతరం సీఎస్కు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ చరకాను బహుకరించారు.
కార్యక్రమంలో సీపీ సీవీ ఆనంద్, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, అడిషనల్ డీజీ జితేందర్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఉన్నత విద్యా శాఖ కమిషన్ నవీన్ మిట్టల్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, రవాణా శాఖ కమిషనర్ బుద్ధా ప్రకాశ్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, హైదరాబాద్ కలెక్టర్ అమయ్ కుమార్, టీఎస్ఐసీసీ నరసింహారెడ్డి, సమాచార శాఖ డైరెక్టర్ బీ రాజమౌళి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ గున్నా రాజేందర్ రెడ్డి, హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ సెక్రెటరీ కోయ చంద్రమోహన్, యానాల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.