హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో అంతర్జాతీయ స్కిల్ సెంటర్ ఏర్పాటుకు సహకరించాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికారులను సీఎస్ శాంతికుమారి కోరారు. ఈ మేరకు కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ శాఖకు సిఫారసు చేయాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం బీఆర్కేఆర్ భవన్లో విదేశీ వ్యవహారాల శాఖ అధికారులకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ (టాంకాం) కార్యకలాపాల గురించి ఆమె వివరించారు. ఉద్యోగాలిచ్చే విదేశీ కంపెనీలకు, నిరుద్యోగులకు మధ్య అనుసంధానకర్తగా టాంకాం పనిచేస్తున్నదని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున టాంకాం ఉద్యోగార్థులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నదని పేర్కొన్నారు. టాంకాంకు అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని ఓవర్సీస్ ఇండియా ఎఫైర్స్ కార్యదర్శి అసుఫ్ సయ్యద్ హామీ ఇచ్చారు. టాంకాం సీఈవో విష్ణువర్ధన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా టాంకాం కార్యకలాపాలను వివరించారు. సమావేశంలో డీజీపీ అంజనీ కుమార్, కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణికుముదిని, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.