హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): 2023-24 వ్యవసాయ సీజన్లో పంట రుణాలు భారీగా పెరగనున్నాయి. రాష్ట్రంలో ప్రధానంగా పండించే వరి, పత్తి రైతులకు ఎకరానికి రూ.5 వేల చొప్పున అదనంగా రుణం అందనున్నది. ఈ మేరకు పంటల రుణ పరిమితిని తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెసాబ్) ఖరారు చేసింది. సాగు ఖర్చు, ఉత్పాదకత, నీటి వసతి ఆధారంగా రుణ పరిమితిని నిర్ధారించి, సంబంధిత నివేదికను రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ)కి పంపింది. ఈ నివేదిక ప్రకారమే రైతులకు పంట రుణాలు ఇవ్వాలని సూచించింది. రాష్ట్రంలో అత్యధికంగా సాగుచేసే వరి, పత్తి పంటలకు ఎకరానికి గరిష్ఠంగా రూ.45 వేల రుణాన్ని ఖరారు చేసింది. 2022-23లో రూ.36 వేల నుంచి 40 వేల వరకు ఉన్న ఈ రుణాలను ఈ ఏడాది రూ.42-45 వేలకు పెంచింది. వరి విత్తనోత్పత్తి రైతులకు ఎకరానికి రూ.46-50 వేల రుణం ఇవ్వాలని పేర్కొన్నది. ఆయిల్పాం రైతులకు ఈసారి ఎకరానికి రూ.40-42 వేల చొప్పున రుణాలు ఇవ్వాలని సూచించింది.
మూగజీవాల పెంపకానికి కూడా టెస్కాబ్ రుణ పరిమితిని ఖరారు చేసింది. గొర్రెల (20+1) పెంపకానికి రూ.21-23 వేలు, మేకల పెంపకానికి రూ.22-25 వేలు ఇవ్వాలని సూచించింది. పందుల (3+1) పెంపకానికి గతంలో రూ.43 వేలుగా ఉన్న రుణ పరిమితిని ఈసారి ఏకంగా రూ.57-58 వేలకు పెంచింది. డెయిరీ నిర్వహణ కోసం ఒకో బర్రెకు రూ.25-27 వేలు, చేపల పెంపకానికి హెక్టారుకు రూ.4 లక్షల చొప్పున రుణాలు ఇవ్వాలని సూచించింది.