హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ)/ చిక్కడపల్లి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు తీవ్ర అన్యాయం చేసిందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. విభజన హామీలను విస్మరించి, ఏపీలో జిన్నా టవర్, తెలంగాణలో భాగ్యనగర్ పేరుతో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నదని పేర్కొన్నారు. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాలు ముగిసిన అనంతరం గురువారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. అధిక ధరలకు వ్యతిరేకంగా ఇతర పార్టీలతో కలిసి పోరాటాలు చేస్తామని చెప్పారు. సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలిగించేలా బీజేపీ చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ కలిసి రావాలని కోరారు. ఇటీవల సీపీఎం కేంద్ర కమిటీ నాయకులు సీఎం కేసీఆర్ని కలిసి సమాఖ్య వ్యవస్థకు జరుగుతున్న ప్రమాదంపై చర్చించినట్టు తెలిపారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. ఈ నెల 23 నుంచి 25 వరకు సీపీఎం రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ ప్రజా జీవితానికి ప్రమాదకరంగా, అభివృద్ధికి ఆటంకంగా మారిందని విమర్శించారు.
కేంద్రీయ సంస్కృత యూనివర్సిటీ వైస్ చాన్స్లర్, ప్రముఖ సంస్కృత పండితుడు ప్రొఫెసర్ విరివెంటి మురళీధర శర్మ (62) కన్నుమూశారు. గురువారం సాయంత్రం గుండెపోటు రావడంతో స్విమ్స్ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఉదయం వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలేశుని దర్శించుకొన్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.