సంగారెడ్డి : గత కొన్ని సంవత్సరాలుగా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పుట్టిన వెంటనే ఆడ శిశువులను వదిలించుకునే ఘటనలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేసిన అధికారులు ఇటువంటి శిశువుల రక్షణ, సంరక్షణార్థం సంగారెడ్డిలోని శిశుగృహలో ‘ఊయల’ ను ఏర్పాటు చేశారు. జిల్లా సంక్షేమ అధికారి రాదా పద్మావతి మాట్లాడుతూ.. గడిచిన మూడు నెలల్లో పటాన్చెరు నియోజకవర్గంలోని వేర్వేరు చోట్ల ఇద్దరు ఆడ శిశువులను తల్లిదండ్రులు పడేసి పోయారు. ఈ ఘటనలో ఓ శిశువును చీమలు విపరీతంగా కుట్టాయి. శిశువును మూడు నెలలు ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తే గానీ కోలుకోలేదు. భవిష్యత్లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు సంక్షేమ శాఖ ఊయలను ఏర్పాటు చేసిందన్నారు. తమకు అవసరం లేని, భారంగా అనిపించిన శిశువులను తల్లిదండ్రులు ఈ ఊయలలో వదిలివేయవచ్చన్నారు.
ఆడ శిశువుల సంరక్షణపై సందేశం పంపేందుకు అధికారులు, ఎన్జీవో సిటిజన్ ఫోరం బుధవారం ఇద్దరు శిశువులకు బారసాల నిర్వహించింది. ప్రముఖ వైద్యులు చక్రపాణి, సంగారెడ్డి జైల్ సూపరింటెండెంట్ ఎన్. శివకుమార్ గౌడ్, జూనియర్ లెక్చరర్ కె.కృష్ణ కుమార్, అనస్థిషియనిస్ట్ డాక్టర్ శంకర్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆడ శిశువుల సంరక్షణ సందేశాన్ని విస్తృత ప్రచారం చేయనున్నట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు.
ఊయల కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి రాధా రమణి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ డి.గాయత్రి, జిల్లా సంక్షేమ అధికారి పద్మావతి హాజరయ్యారు. శిశుగృహలో ఉన్న చిన్నారులకు, సిబ్బందికి అధికారులు ఈ సందర్భంగా నూతన వస్ర్తాలను బహూకరించారు. ఈ సందర్భంగా రాధా రమణి మాట్లాడుతూ. మహిళలు ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో తమ సమర్థతను నిరూపించు కుంటున్నారన్నారు. ఆడపిల్లల్ని కాపాడకపోతే మానవ జాతికి భవిష్యత్ ఉండదన్నారు. బాలికల రక్షణ కోసం పనిచేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.