జనగామ చౌరస్తా/మిర్యాలగూడ, సెప్టెంబర్ 17: వచ్చే ఎన్నికల్లో కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. శనివారం జనగామలోని ప్రెస్టన్ జూనియర్ కళాశాల గ్రౌండ్లో సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు బహిరంగ సభ జరిగింది. అలాగే నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభలో ఆయన మాట్లాడారు. ‘1948 జనవరి 30న మహాత్మాగాంధీ హత్య జరిగింది.. ఆ తర్వాత ఫిబ్రవరి నుంచి 1949 సెప్టెంబర్ వరకు ఆర్ఎస్ఎస్పై నిషేధం విధించారు.. ఆర్ఎస్ఎస్ నాయకులంతా గాంధీ హత్యారోపణలపై జైళ్లో ఉన్నారు.. తెలంగాణ విలీనం 1948 సెప్టెంబర్ 17న జరిగింది. దీంతో ఆర్ఎస్ఎస్, బీజేపీకి ఏ మాత్రం సంబంధం లేదు. ఇవాళ ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు విమోచన దినోత్సవం అంటూ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది’ అన్నారు. దేశ ఆర్థిక రంగాన్ని నాశనం చేశారని, మతపరంగా సమాజాన్ని చీల్చుతూ తమకు అనుకూలంగా లేని ప్రభుత్వాలపై ఈడీ, సీబీఐతో దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.