హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను గుర్తించేందుకు, విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడానికి పాలకులకు భయమెందుకని సీపీఐ నాయకులు ప్రశ్నించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ ఎగ్జిబిషన్ మైదానంలో ‘పోరాట స్పూర్తి సభ’ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వారసులుగా సెప్టెంబర్ 17ను ‘తెలంగాణ స్వాతంత్ర దినోత్సవం’ పేరుతో ఉత్సవాలు జరుపుకొంటుంటే కాంగ్రెస్ ’ప్రజాపాలన’, బీజేపీ ‘విమోచన దినోత్సవం’ పేరుతో సభలు జరుపుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.