Adani | హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): బీజేపీ పాలనలో అదానీని ప్రశ్నించే దమ్ము దర్యాప్తు సంస్థలకు ఉందా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్పై నమోదైన కేసులు బీజేపీలో చేరగానే మాయమయ్యాయని ఆరోపించారు. రెండు రోజులుగా హైదరాబాద్లో జరిగిన సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు శుక్రవారం ముగిశాయి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తొమ్మిదేండ్ల బీజేపీ పాలనలో తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన ఘనత మోదీ సర్కారుకే దక్కిందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించాల్సిందేనని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ హఠావ్.. దేశ్కో బచావ్ అని కూనంనేని నినదించారు. కాగా, ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14 నుంచి మే 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో పాదయాత్రలు చేస్తామని కూనంనేని తెలిపారు.