హైదరాబాద్ : వచ్చే జనవరి 3వ తేదీ నుంచి తెలంగాణలో పిల్లలకు కొవిడ్ టీకాలు వేయనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ప్రకటించారు. 15-18 సంవత్సరాల మధ్య ఉన్న వారికి టీకా వేస్తామన్నారు. కొవిన్ పోర్టల్లో స్లాట్ బుక్ చేసుకోవాలన్నారు. హైదరాబాద్, పురపాలికల్లో కొవిన్ పోర్టల్లో నమోదు చేయాలన్నారు. పీహెచ్సీలు, వైద్య కళాశాలల్లో టీకాలు వేయనున్నట్లు చెప్పారు. 2007 కంటే ముందు పుట్టిన పిల్లలకు వ్యాక్సిన్ వేస్తామన్నారు.
అర్హులైన పిల్లలందరికీ కొవాగ్జిన్ టీకా వేస్తామని, కొవాగ్జిన్ టీకాను కేంద్రం సూచించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 15-18 సంవత్సరాల పిల్లలు 22.78లక్షల మంది ఉన్నారని, 61 సంవత్సరాలు దాటిన వారు 41.60లక్షల మంది ఉన్నారన్నారు. ఈ సందర్భంగా పాత్రికేయులకు బూస్టర్ డోస్ మంత్రి హరీశ్రావు చెప్పారు. అలాగే రాష్ట్రంలో కొత్తగా ఏడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని, కొత్త కేసులతో మొత్తం సంఖ్య 62కు పెరిగాయన్నారు.
62 మంది బాధితుల్లో 46 మంది టీకా తీసుకోలేదని, ట్రావెల్ హిస్టరీ లేని ముగ్గురికి ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యిందని తెలిపారు. విమానాశ్రయంలో ఇప్పటి వరకు 11,756 మందిని స్క్రీనింగ్ చేశామని, టీకా తీసుకోని వారిలో పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం 87శాతం టీకాలు అందించింది, ప్రైవేటు వైద్యశాలలు 13శాతం టీకాలు అందించాయని వివరించారు. రాష్ట్రంలో టీకాల కొరత లేదని, 30లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు.