హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): కరోనా వైరస్ తగ్గినా దాని ప్రభావం శరీరంలోని అవయవాలను నీడలా వెంటాడుతుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ మంది గుండె సంబంధిత సమస్యలకు గురవుతున్నట్లు చెప్తున్నారు. కరోనా వైరస్ ఊపిరితిత్తులపైనే ప్రభావం చూపుతుందని తొలుత గుర్తించినప్పటికీ ఇతర ఆర్గాన్స్ను కూడా దెబ్బతీస్తుందని తేలింది. వైరస్ సోకిన వారందరిలోనూ గుండె సమస్యలు రావని మెడికవర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ శరత్రెడ్డి తెలిపారు. గతంలో గుండె సమస్యలు ఉన్నవారు, గుండె సమస్య కుటుంబ నేపథ్యం గలవారిపై వైరస్ ప్రభావం సాధారణ రోగులకంటే ఎక్కువగా ఉండే అవకాశాలున్నట్టు వివరించారు. రక్తం గడ్డకట్టడం, ఊపిరితిత్తులు దెబ్బతినడంతో గుండెపై భారం పెరుగుతుందని.. ఈ క్రమంలో కూడా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ వంటి ఎరోబిక్ వ్యాయామాల వల్ల గుండెపోటు రాదని చెప్పారు. ఇవి గుండెపోటు రాకుండా దోహదపడతాయన్నారు. సుదీర్ఘ విరామం తరువాత తీవ్రమైన వ్యాయామం చేయడం, గుండె సమస్యలు ఉన్నవారు అతిగా జిమ్ చేయడంతో సమస్యలు వచ్చే ఆస్కారం ఉన్నదని వివరించారు. పొగతాగే అలవాటున్న వారిలో సాధారణ వ్యక్తుల కంటే 10 రెట్లు అధికంగా గుండెపోటు వచ్చే ఆస్కారం ఉంటుంది.