కాకతీయుల కాలంనాటి త్రిమూర్తి శిల్పంగా గుర్తింపు
అరుదైనదిగా పేర్కొన్న పురావస్తు పరిశోధకులు
నల్లగొండ ప్రతినిధి/హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): మధ్యయుగ చరిత్రకు ఆనవాైళ్లెన శిల్పాలు, శాసనాలు తెలంగాణలో ఎక్కడో ఒకచోట బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా నల్లగొండ జిల్లా నకిరేకల్ మం డలం నోములలో స్థానిక శిథిల నరసింహస్వామి ఆలయాన్ని పదిలపరిచేందు కు నేల చదును చేస్తుండగా అపురూప శిల్పం బయటపడింది. పురావస్తు పరిశోధకుడు, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ, అమరావతి (సీసీవీఏ) సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి బుధవారం నోములకు వెళ్లి శిల్పాన్ని పరిశీలించారు. ఇది అరుదైన త్రిమూర్తి (హరిహర పితామహ) శిల్పమని తెలిపారు. 2.5 అడుగుల ఎత్తు, అడు గు వెడల్పు, 9 అంగుళాల మం దంతో నల్లశానపు రాతితో చెక్కబడి ఉన్నదని చెప్పారు. బ్రహ్మ దేవుడిలా కనిపిస్తున్న ఈ విగ్రహం మెడవరకు ఒకే శరీరంతో, మెడపైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల తలలతో ఉన్నదన్నారు. కుడివైపు రెండు చేతుల్లో శూలం, దండం, ఎడమవైపు రెండు చేతుల్లో శంఖం, అక్ష (జప) మాల ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలోని చాలా ఆలయాల్లో శివుడు, విష్ణువు, బ్రహ్మ శిల్పాలు ఒకే వరుసలో విడివిడిగా ఉన్నాయని, కానీ ఈ విగ్రహంలో ఒకే శరీరంతో ముగ్గురు ప్రధాన దేవతలను తీర్చిదిద్దారన్నారు.
కొత్త తెలంగాణ చరిత్ర బృందం శ్రీరామోజు హరగోపాల్, ప్రముఖ చరిత్ర పరిశోధకుడు డాక్టర్ జైశెట్టి రమణయ్య సైతం ఇంతకుముందు ఇలాంటి శిల్పం ఉనికి ఎక్కడా లేదని చెప్పారని శివనాగిరెడ్డి తెలిపారు. ఇది క్రీ.శ 13వ శతాబ్దానికి చెందినదన్నారు. కాకతీయుల్లో గణపతి దేవుని కాలంలో హరిహరాధన ప్రారంభమై సమాజంలో మతసామరస్యం నెలకొన్నదని పేర్కొన్నారు. అనంతరం ఊరి చివర పాత శివాలయం వద్ద బయటపడిన ఆసీన వీరభద్ర, భద్రకాళి, భైరవ తదితర విగ్రహాలను శివనాగిరెడ్డి పరిశీలించారు. నోములలో కాకతీయ ఆలయ శిథిలాలను, శిల్పాలను భద్రపరచాలని రాష్ట్ర ప్రభుత్వ వారసత్వ విభాగానికి ఆయన విజ్ఞప్తిచేశారు.