హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని ప్రభు త్వ, ప్రైవేట్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్లు, సింగిల్ డాక్టర్ క్లినిక్లు సహా గుర్తింపు పొందిన అన్ని వైద్య వ్యవస్థల రిజిస్ట్రేషన్, రెగ్యులరైజేషన్ కోసం రాష్ట్రస్థాయి మండలిని ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం కింద ఈ మండలిని ఏర్పాటు చేశామని, ఈ మేరకు జీవో 65 జారీచేశామని చెప్పింది. ఈ మండలికి వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి లేదా కార్యదర్శుల్లో ఒకరు చైర్మన్గా, ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ సభ్య కార్యదర్శిగా ఉంటారని వివరించింది. ఇదేవిధంగా జిల్లా రిజిస్ట్రేషన్ ఆథారిటీలకు కలెక్టర్ చైర్మన్గా, జిల్లా వైద్యాధికారి సభ్య కార్యదర్శిగా ఉంటారని పేర్కొన్నది. రాష్ట్రంలో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ (నమోదు, నియంత్రణ) చట్టాన్ని అమలు చేయాలంటూ ఫోరం ఫర్ అగైనెస్ట్ కరప్షన్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ప్రభుత్వం ఈ వివరణ ఇచ్చింది. దీంతో ఆ పిల్పై విచారణను మూసివేస్తున్నట్టు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్ తుకారాంజీ ధర్మాసనం ఇటీవల ప్రకటించింది.