మెహిదీపట్నం, మే 12: వారిది నిరుపేద కుటుంబం. యాభై ఏండ్లు వచ్చినా ఎవరికీ పెండ్లికాని దైన్యం. అంతా మానసిక వ్యధతో కుమిలిపోయే స్థితి అంతలోనే అన్నకు అనారోగ్యం.. దవాఖానలో చనిపోయిన అన్న అంత్యక్రియలు చేయడానికి చేతిలో చిల్లిగవ్వ లేని దుర్భర దారిద్య్రం. ఏం చేయాలో పాలుపోని సంకట పరిస్థితి.. చివరకు అన్న, చెల్లెలు కలిసి కఠిన నిర్ణయమే తీసుకున్నారు. అన్న మృతదేహాన్ని ముక్కలుగా నరికి గోనెసంచిలో కట్టి రోడ్డుపై పడేశారు. చివరకు పోలీసులకు చిక్కారు. ముందుగా అంతా ఎవరినో హత్యచేసి పడేశారని అనుకున్నారు. కానీ, వారి దీనస్థితిని తెలుసుకొని కంటతడి పెట్టడం స్థానికుల వంతైంది. ఈ హృదయ విదారక ఘటన బండ్లగూడలో చోటుచేసుకున్నది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం బండ్లగూడ ఎన్ఎఫ్సీ కాలనీలో నివాసముండే బాలమణికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వీరిలో మొదటి కొడుకు విజయ్కుమార్ పోస్టాఫీస్లో ఉద్యోగం చేస్తున్నాడు. రెండో కొడుకు అశోక్ (52), మూడో కుమారుడు రాజ్కుమార్ (45), కూతురు స్వరూపరాణి (38)లకు పెండ్లి కాలేదు. చిన్న కూతురు శోభారాణికి వివాహమైంది. ఆమె ఓ ప్రైవేట్ హాస్పిటల్లో స్వీపర్గా పనిచేస్తున్నది. అశోక్, రాజ్కుమార్ మద్యానికి బానిసలుగా మారారు. వీరందరి మానసికస్థితి సరిగా ఉండదు. మూడు నెలలుగా అశోక్ ఆరోగ్యం బాగలేకపోవడంతో దవాఖానలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.
మానసికస్థితి సరిగా లేని వీరికి ఆదాయ వనరులు లేవు. చనిపోయిన అన్న మృతదేహానికి అంత్యక్రియలు చేయలేని పరిస్థితి తలెత్తింది. గురువారం రాత్రి సోదరి సహకారంతో అన్న మృతదేహాన్ని రాజ్కుమార్ ముక్కలుగా చేశాడు. వాటిని గోనెసంచిలో వేసి ఆటోట్రాలీ మాట్లాడుకొని లంగర్హౌస్ దర్గా సమీపంలో పడేశారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని గోనెసంచిని పరిశీలించగా అందులో మృతదేహం అవయవాలు కనిపించాయి. వీటిని పడేసిన రాజ్కుమార్, స్వరూపను లంగర్హౌస్ పోలీసులు పట్టుకొని విచారించగా, ఈ హృదయవిదారక ఘటన వెలుగు చూసింది. మృతదేహం ముక్కలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తులో ఉన్నది.