హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): నిన్నమొన్నటిదాకా తగ్గినట్టు కనిపించిన కరోనా ఒక్కసారిగా సుడిగాలి వేగంతో ప్రజలపై దండెత్తుతున్నది. ప్రతిరోజూ లక్షల మందిని ఆవహిస్తున్నది. ఊపిరాడనివ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నది. ఈ సెకండ్ వేవ్ ఎప్పుడు తగ్గుముఖం పడుతుందనే అంశంపై ఐఐటీ శాస్త్రవేత్తలు స్పష్టతనిచ్చారు. ఇప్పటి వరకు దేశంలో నమోదైన కేసులు, వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య తదితర లెక్కలను సూత్రీకరించి.. మే రెండోవారానికి గరిష్ఠస్థాయికి చేరుకొని, నెల చివరినాటికి అంతేవేగంతో తగ్గుముఖం పడుతుందని వెల్లడించారు. ప్రస్తుతం 24.28 లక్షలుగా ఉన్న కొవిడ్ యాక్టివ్ కేసులు మే 15 నాటికి 33 లక్షల నుంచి 35 లక్షల గరిష్ఠస్థాయికి చేరుకుంటాయని వివరించారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో కొత్త కేసుల సంఖ్య ఇప్పటికే గరిష్ఠ స్థాయికి చేరుకోగా, ఏప్రిల్ 30 నాటికి ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, తెలంగాణలో కొత్త కేసులు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.