జంతువులకు బలవర్ధక ఆహారం, ఔషధాలు
హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): మనుషులకే కాదు ఇప్పుడు జూపార్క్లు, డీర్ పార్క్లు, మినీ పార్క్ల్లోని జంతువులకూ కరోనాను తట్టుకొనేలా ఆహారాన్ని, ఔషధాలను అందిస్తున్నారు. హైదరాబాద్ నెహ్రు జులాజికల్ పార్క్లో 8 ఆసియాటిక్ సింహాలకు కొవిడ్ సోకిన క్రమంలో అటవీశాఖ మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటున్నది. జంతువులు వైరస్ను తట్టుకొనేలా మల్టీ విటమిన్, యాంటీ బయోటిక్, బీ కాంప్లెక్స్ ట్యాబ్లెట్లను ఇస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు అన్ని జంతువులకు హైదరాబాద్ జూతోపాటు వరంగల్, మహబూబ్నగర్, ఇతర మినీ జూపార్క్ల్లో, డీర్ పార్క్ల్లో కరోనా సోకకుండా చర్యలు తీసుకుంటున్నారు. మనుషుల ద్వారా వైరస్ సోకినా అవి తట్టుకొనేలా పోషకాహారాన్ని ఇస్తున్నారు. పాలు, మాసంలో బీ కాంప్లెక్స్, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు ఇస్తున్నామని, దీంతో జంతువుల రోగనిరోధకశక్తి పెరుగుతుందని నెహ్రు జూ అసిస్టెంట్ డైరెక్టర్, వెటర్నరీ డాక్టర్ హకీం తెలిపారు.
యానిమల్ కీపర్లకు పీపీఈ కిట్లను ఇస్తున్నారు. వాస్తవానికి కరోనా సోకకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ నెల 2 నుంచి జూపార్క్లను, డీర్పార్క్లను, ఎకో టూరిజం సెంటర్లలోకి సందర్శకుల అనుమతిని నిలిపివేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ జూలో 8 సింహాలకు కరోనా సోకిన క్రమంలో అటవీశాఖ అధికారులు తీసుకున్న కట్టుదిట్టమైన చర్యలను సెంట్రల్ జూ అథారిటీ అభినందించింది. వైరస్ సోకినప్పటికీ ఇతర జంతువులకు వ్యాపించకుండా యుద్ధప్రాతిపదికన ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నందున కరోనాను కట్టడి చేయగలిగినట్టు పేర్కొన్నది.