విద్వేషాలు సృష్టిస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పండి

సంగారెడ్డి : అభివృద్ధి చేసేవాళ్లు కావాలో..బాంబులు వేసి కూలగొట్టేవాళ్లు కావాలో నిర్ణయించుకోవాలని ఓటర్లకు మంత్రి హారీష్ రావు సూచించారు. జీజేపీ మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతోందని విమర్మించారు. పటాన్చెరు డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వదించి పంపించిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మెట్టు కుమార్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని సంఘం సభ్యులను కోరారు. సర్జికల్ స్ట్రైక్స్ అభివృద్ధి మీద, నిరుద్యోగం మీద, పేదరికం మీద చేయాలన్నారు.
మతం పేరుతో బీజేపీ ప్రజల మధ్య విభజన రాజకీయాలకు తెర తీసిందని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సర్జికల్ స్ట్రైక్స్కి సంబంధం ఉందా అని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోంటే..టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చి కాపాడుతోందన్నారు. భారతీయ జనతా పార్టీ చరిత్ర ప్రజలందరికీ తెలుసన్నారు. ప్రశాంత వాతవరణం ఉన్నప్పుడే పెట్టుబడులు పుష్కలంగా వస్తాయన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పటీకే చెత్తులెత్తేసిందని మంత్రి పేర్కొన్నారు.
అంతర్గతంగా బీజేపీ పార్టీ అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తోందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వం బలపడాలంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించాలని సూచించారు. కార్యక్రమంలో పఠాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ శాసన సభ్యుడు చింతా ప్రభాకర్, టీఆర్ఎస్ నాయకులు సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ హారిక విజయ్కుమార్, మున్నూరుకాపు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.