హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖకు రాజకీయ రంగు పులుముకుంటున్నది. రెండు ఉద్యోగ సంఘాల ఆధిపత్య పోరులో ఆ శాఖ ఉద్యోగులు, అధికారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రభావం ఎక్సైజ్శాఖ ఆదాయంపై పడుతుందేమోనని పలువురు ఉన్నతాధికారులు ఆందోళన చెందుతున్నారు. ఎక్సైజ్ శాఖ ఉద్యోగులను కొన్నేండ్లుగా రెండు ఉద్యోగ సంఘాలు నడిపిస్తున్నాయి. అందులో రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీజీవో అనుబంధ) ఒకటి కాగా, రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ మరొకటి. అయితే రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొంతకాలంగా క్రియాశీలకంగా లేని రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధిపత్యం సాధించేందుకు ప్రయత్నిస్తున్నది. ఉద్యోగ బదిలీలను ‘జీరో ట్రాన్స్ఫర్ల’ పేరుతో చేపట్టాలని ప్రభుత్వానికి వినతిపత్రాలు అందజేస్తున్నది. నాడు ఫోకల్ పోస్టుల్లో అక్రమంగా సంపాదించి, నేడు నాన్ఫోకల్ పోస్టుల్లో ఉన్న రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులే ఇలా వినతులు ఇస్తున్నారని టీజీవో అనుబంధ సంఘం ఆరోపిస్తున్నది.
ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడని తమ సంఘంలోని ఉద్యోగులను ఇబ్బంది పెట్టేందుకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రయత్నిస్తున్నదని గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆరోపిస్తున్నది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్కు అధ్యక్షుడిగా బైలా నిబంధనలను ఉల్లంఘిస్తూ ఒక ఎస్సై స్థాయి అధికారిని నియమించారని టీజీవో నాయకులు చెప్తున్నారు. ఈ కొత్త యూనియన్ను ముందుండి నడిపిస్తున్న ఆ అధికారి 317 జీవో ప్రకారం మల్టీజోన్-1లో విధులు నిర్వర్తించాల్సి ఉండగా, పైరవీలు చేస్తూ హైదరాబాద్లో అడుగుపెట్టేందుకు ఇతర నాయకులను బలి చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. కొన్నేండ్లుగా ఫోకల్ పోస్టుల్లో తిష్ట వేసిన కొందరు అధికారులను గత ప్రభుత్వం నాన్ ఫోకల్ పోస్టుల్లో నియమించిందని, దీనితో కక్ష గట్టిన ఆ సంఘం నేతలు ప్రభుత్వం మారిన వెంటనే తమ సంఘంలో ఉన్న ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారని టీజీవో అనుబంధ సంఘం ఆరోపిస్తున్నది. ఉద్యోగుల సమస్యలపై ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఇన్నిరోజులు ఎందుకు మాట్లాడలేదో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.
ఒక ఉద్యోగి చాలా ఏండ్లుగా ఫోకల్ పాయింట్లో పనిచేస్తే ఆ ఉద్యోగిని అనంతరం నాన్ ఫోకల్ పాయింట్కు మారుస్తారు. గత ఎన్నికలకు ముందు 5 నుంచి 6 ఏండ్లపాటు ఫోకల్ పాయింట్లో పనిచేసిన ఉద్యోగులను నాన్ ఫోకల్ పాయింట్లోకి మార్చారు. దీంతో వారిలో కొందరు పనిగట్టుకొని ప్రస్తుతం ఫోకల్ పాయింట్లో పనిచేసే వారిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, పనిగట్టుకొని ఫిర్యాదులు చేయిస్తున్నారని టీజీవో అనుబంధ సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. బదిలీలకు ఎలాంటి టైమ్ పిరియడ్ లేకుండా ‘జీరో ట్రాన్స్ఫర్లు’ చేయాలని ఉన్నతాధికారులకు, ప్రభుత్వ పెద్దలకు వినతిపత్రాలు ఇస్తున్నారని మండిపడుతున్నారు.