ఖైరతాబాద్, ఆగస్టు 30: ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు, ప్రజా సమస్యలపై ప్రశ్నలు సంధిస్తే ఆంక్షలు విధిస్తున్నారని పలువురు సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు ఆవేదన వ్యక్తంచేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శిల్పారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం సోషల్ మీడియా అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి, ప్రజా సమస్యలను వెలుగులోకి తేవడానికి, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడానికి కీలక వేదికగా మారిందని అన్నారు.
ఏపీ సర్కార్, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, విమర్శించే కంటెంట్లు పెడితే తొలగిస్తూ ఆంక్షలు విధిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. గత రెండేండ్లలో రెండు లక్షల సోషల్ మీడియా వీడియోలు తొలగించారని ఆరోపించారు. ఇంత పెద్దసంఖ్యలో వీడియోలు తొలగించడం భావప్రకటన స్వేచ్ఛ, ప్రశ్నించే హక్కుతోపాటు ప్రభుత్వాలను జవాబుదారీగా నిలబెట్టే ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రభావం చూపే అవకాశం ఉన్నదని తెలిపారు. రెండేండ్లలో ఎన్ని వీడియోలు, పోస్టులు తొలగించారు, వాటి తొలగింపునకు ఉపయోగించిన చట్టపరమైన నిబంధనలు ఏమిటో వెల్లడించాలని డిమాండ్ చేశారు.