హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ మోసపూరిత హామీలపై ఏకంగా ఆ పార్టీ కార్మిక సంఘాలే మండిపడుతున్నాయి. కాంగ్రెస్ అధికారం చేపట్టి రెండేండ్లు గడిచినా ఆర్టీసీలో ఏ ఒక్క సమస్యను పరిష్కరించకపోవడంతో కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఎస్డబ్ల్యూఎఫ్(ఐఎన్టీయూసీ) పోరుబాట పట్టింది. అధికార పార్టీ ఇచ్చిన హామీలను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలకు పిలుపునిచ్చింది. సంఘం కార్యదర్శి రాజిరెడ్డి ఈ నెల 23 నుంచి 26 వరకు సామూహిక నిరాహార దీక్షలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ సామూహిక నిరాహార దీక్షలు చేపట్టినట్టు రాజిరెడ్డి తెలిపారు. అన్ని కార్మిక సంఘాలు, యూనియన్ల నేతల నుంచి మద్దతు కోరారు. ఈ మేరకు ఆదివారం అన్ని కార్మిక సంఘాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాశారు. దీక్షలకు అన్ని సంఘాల నుంచి కార్మికులు వేలాదిగా తరలిరావాలని కోరారు.
సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న పోరాటాలు కేవలం కార్మికుల కోసమేనని రాజిరెడ్డి చెప్పారు. కార్మికులకు మేలు చేసే క్రమంలో రాజీపడబోమని చెప్పారు. ఇచ్చిన హామీలు అమలుకు నోచకపోవడంతో కార్మికులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు చెప్పారు. హామలు అమలుచేయకపోతే ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధమవుతామని ప్రకటించారు.