KTR | మైనార్టీలను కాంగ్రెస్ ఓటు బ్యాంకులా వాడుకుంటోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో శనివారం నిర్వహించిన మైనార్టీ విభాగం సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్పై కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టిన మైనార్టీ సోదరులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చినందుకే మైనార్టీలపై కాంగ్రెస్ పగబట్టిందని అన్నారు.
1953 తర్వాత రాష్ట్ర క్యాబినెట్లో మైనార్టీలకు స్థానం దక్కకపోవడం ఇదే మొదటిసారి అని కేటీఆర్ తెలిపారు. షబ్బీర్ అలీ పేరు వాడుకున్న కాంగ్రెస్ పార్టీ. ఆయనకు సలహాదారు పదవి ఇచ్చి చేతులు దులుపుకుందని విమర్శించారు. మైనార్టీలకు మంత్రి పదవి కాకుండా సలహాదారు పదవి ఇవ్వడం వారి ఆత్మగౌరవాన్ని కించపరచడమే అని ఆయన అన్నారు. గత పార్లమెంటు ఎన్నికల మాదిరే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజీపీ కుమ్మక్కు అయ్యాయని ఆరోపించారు. మైనార్టీలను కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగా వాడుకుంటోందని విమర్శించారు.