మంగపేట, నవంబర్ 8: ములుగు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు కొమరం ధనలక్ష్మి బుధవారం కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి సీతక నామినేషన్ దాఖలు చేసిన రోజే ఆమె పార్టీ మారడం చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజులుగా కాంగ్రెస్ నాయకులు ఒకొకరుగా పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరుతుండటంతో ములుగు నాయకత్వానికి కంటిమీద కునుకు లేకుండా పోయింది. ములుగు నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జ్జి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్రావు, రోడ్లు, భవనాల డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ సమక్షంలో కొమరం ధనలక్ష్మి బీఆర్ఎస్లో చేరగా.. ములుగు ఎన్నికల ఇన్చార్జి పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పోచంపల్లి మాట్లాడుతూ.. 60 ఏండ్ల సుదీర్ఘ పరిపాలనలో కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. అన్ని వర్గాల సంక్షేమ పాలన కేవలం ఒక్క సీఎం కేసీఆర్కే సాధ్యమని పేర్కొన్నారు. ధనలక్ష్మి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం కేసీఅర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితురాలినై బీఆర్ఎస్లో చేరానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి బాడిశ నాగరమేశ్, జిల్లా కో-ఆప్షన్ సభ్యులు వలీబాబా, పార్టీ జిల్లా సీనియర్ నాయకుడు కాకులమర్రి ప్రదీప్రావు తదితరులు పాల్గొన్నారు.