హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): శాస్త్రవేత్తలకు సామాజిక బాధ్యత ఉంటుందని, సమాజ హితానికి అవసరమైన పరిశోధనలపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని రక్షణరంగ శాస్త్రవేత్తలకు డిఫెన్స్ ఆర్అండ్డీశాఖ కార్యదర్శి, డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ జీ సతీశ్రెడ్డి సూచించారు. రక్షణ సాంకేతికతతోపాటు పర్యావరణ హితమైన పరిశోధనలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అన్నారు. డీఆర్డీఏకు చెందిన అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లేబరేటరీ (ఏఎస్ఎల్) శాస్త్రవేత్త డాక్టర్ వీరబ్రహ్మం రూపొందించిన బయోడిగ్రేడబుల్ క్యారీబ్యాగ్ టెక్నాలజీని పలు పరిశ్రమలకు అందించారు. వీరబ్రహ్మంను, ఆయనను అన్ని విధాలుగా ప్రోత్సహించిన డీఆర్డీఓ డైరెక్టర్ జనరల్ బీహెచ్వీఎస్ నారాయణమూర్తిని అభినందించారు.
బుధవారం ఏఎస్ఎల్ సెంటర్లో పలువురు పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశానికి డీఆర్డీఓ చైర్మన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. డీఆర్డీఓకు చెందిన ఏఎస్ఎల్ శాస్త్రవేత్తలు కనుగొన్న ఈ సాంకేతికతను పరిశ్రమలకు ఎలాంటి రాయల్టీ లేకుండానే ఉచితంగానే అందిస్తామన్నారు. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున ఉండేలా కనీసం 500 నుంచి 600 వరకు పరిశ్రమలు బయోడిగ్రేడబుల్ వస్తువుల తయారీ పరిశ్రమలు నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. తొలివిడతలో 20 కంపెనీల ప్రతినిధులకు అనుమతి పత్రాలను సతీశ్రెడ్డి అందించారు. మరో 45 పరిశ్రమలు త్వరలోనే రాబోతున్నట్టు వెల్లడించారు.
మనదేశంతోపాటు అమెరికా వంటి దేశాల్లోని పరిశ్రమలు సైతం మన టెక్నాలజీని వాడుకుని బయోడిగ్రేడబుల్ క్యారీబ్యాగ్ల తయారీకి ముందుకు వస్తున్నాయని అన్నారు. వీటిని తయారు చేయడంలో తొలినాళ్ల నుంచి సహకారం అందిస్తున్న ఎకోలాస్టిక్ పరిశ్రమ ప్రతినిధులను సతీశ్రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఇప్పటికే ఈ బయోడిగ్రేడబుల్ క్యారీబ్యాగ్లను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం పంపిణీకి వాడుతున్నట్టు పేర్కొన్నారు. అతి త్వరలోనే వాటర్ బాటిళ్లు, ఇతర వస్తువుల తయారీపై దృష్టి పెడతామని పేర్కొన్నారు.