యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని చిత్తుగా ఓడించి మతతత్వ బీజేపీకి బుద్ధి చెప్పాలని సీపీఎం, సీపీఐ నేతలు పిలుపునిచ్చారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు బలపర్చిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కమ్యూనిస్టుల అడ్డా అయిన మునుగోడులో బీజేపీకి తావివ్వొద్దని, ప్రభాకర్రెడ్డి గెలిస్తే.. కమ్యూనిస్టులు గెలిచినట్టేనని చెప్పారు. కూసుకుంట్ల విజయాన్ని కాంక్షిస్తూ మంగళవారం నల్లగొండ జిల్లా చండూరులో సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి ఆ పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
గెలిపిస్తే ప్రాజెక్టులన్నీ పూర్తి చేయిస్తా: కూసుకుంట్ల
కమ్యూనిస్టు భావజాలంతో తెలంగాణ ఉద్యమంలో ఉద్యమించానని మాజీ ఎమ్మెల్యే, మునుగోడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో గెలిచాక నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, సీఎం కేసీఆర్ను ఒప్పించి వేల కోట్లతో మూడు ప్రాజెక్టులను తీసుకొచ్చానని గుర్తుచేశారు. రాజగోపాల్రెడ్డి హయాంలో అవి ఆగిపోయాయని, టీఆర్ఎస్ను గెలిపిస్తే వాటిని పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. 2018 తర్వాత నియోజకవర్గంలో అభివృద్ధి కుంటు పడిందన్నారు. సభలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, సీపీఐ రాష్ట్ర నేత చాడ వెంకట్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నంద్యాల నర్సింహారెడ్డి, జూలకంటి రంగారెడ్డి, పల్లా వెంకట్రెడ్డి, ఉజ్జిని యాదగిరిరావు, సీపీఎం, సీపీఐ నల్లగొండ జిల్లా కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, నెల్లికంటి సత్యం తదితరులు పాల్గొన్నారు.
చిత్తుగా ఓడించాలే: తమ్మినేని
మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డిని చిత్తుగా ఓడించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎనిమిదేండ్లలో ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. మోటర్లకు మీటర్లు పెట్టి రైతుల పొట్టగొట్టాలని చూస్తున్నదని దుయ్యబట్టారు. హిట్లర్ ఆదర్శమని చెబుతున్న కమలం పార్టీని ఆదిలోనే అంతం చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీని గద్దె దించే వరకు టీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలు కలిసే పనిచేస్తాయని స్పష్టం చేశారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి ఒక్కొక్కరి అకౌంట్లలో రూ.15లక్షల జమ చేస్తామని మోసం చేసిందని, ఇప్పటికీ నయాపైసా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని నాశనం చేసే కుట్ర చేస్తున్నదని విమర్శించారు. తమ పార్టీలపై రాజగోపాల్రెడ్డి అడ్డమైన వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
రాజగోపాల్రెడ్డి పెద్ద 420: కూనంనేని
మునుగోడు ఉప ఎన్నికలో కూసుకుంట్ల విజయం తథ్యమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. కమ్యూనిస్టుల మద్దతుతో గెలిచిన రాజగోపాల్రెడ్డి.. ఇప్పుడు తమపైనే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి పెద్ద మోసగాడని, ఆయనో పెద్ద 420 అని దుయ్యబట్టారు. కరోనా వంటి బీజేపీని అడ్డుకోవడానికే టీఆర్ఎస్తో జత కట్టామని చెప్పారు. దేశంలో బీజేపీ మతోన్మాద రాజకీయాలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు.