హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనలో భాగంగా రూ.10 కోట్లకు పైబడిన ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ (ఈపీసీ) పనుల పర్యవేక్షణ, నిర్వహణ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. నూతనంగా ఏర్పాటైన మలాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ), సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ)లలో ఈపీసీ విధానం కింద చేపట్టే అన్ని ప్రాజెక్టు పనుల కోసం ప్రత్యేక కమిటీలను పునర్వ్యవస్థీకరిస్తూ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి(ఎంఏయూడీ) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్రంజన్ గురువారం జీవో జారీ చేశారు.
మున్సిపల్ కార్పొరేషన్లలో టెండర్ ప్రక్రియను సరళీకృతం చేస్తూ, పనుల్లో జాప్యాన్ని నివారించేందుకు టెండర్ సంసరణలను అమలు చేస్తున్నట్టు జీవోలో తెలిపారు. భారీ బడ్జెట్తో కూడిన (రూ. 10 కోట్లకు పైబడిన) డ్రైనేజీ, రోడ్లు, ఫ్లై ఓవర్లు, తాగునీటి సరఫరా వంటి కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టులన్నీ ఇకపై ఈ కమిటీల ప్రత్యక్ష పర్యవేక్షణలోనే జరుగనున్నాయి. కొత్తగా ఏర్పడిన ఈ రెండు కార్పొరేషన్ల అవసరాలకు అనుగుణంగా కమిటీలను మార్చడం ద్వారా నిర్ణయాలు వేగంగా జరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.