BCom | హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ) : రాబోయేకాలంలో కామర్స్ కోర్సులదే భవిష్యత్తు. ఈ కోర్సు పూర్తిచేసిన 60 శాతం మందికిపైగా విద్యార్థులకు ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఉద్యోగాలే కాదు.. కంపెనీలు మంచి ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి. ఇది గతంలో వెల్లడైన ఇండియా స్కిల్స్ రిపోర్ట్ -23 నివేదిక సారాంశం. ఈ ఏడాదిలో డిగ్రీ కోర్సుల్లో చేరేవారిలో అత్యధికులు కామర్స్ కోర్సులవైపే చూస్తున్నారు. ఈ ఏడాది దోస్త్ రిజిస్ట్రేషన్లు ఇటీవలే ప్రారంభంకాగా, వెబ్ఆప్షన్ల స్వీకరణ శనివారం నుంచి ప్రారంభమైంది. రెండేండ్లుగా సైన్స్ కోర్సులకు డిమాండ్ తగ్గి, కామర్స్కు క్రేజ్ పెరుగుతూ వస్తున్నది. దీంతో వచ్చే ఏడాది కూడా అదే పునరావృతమవుతుందన్న అంచనాలున్నాయి. గత కొన్నేండ్లుగా తెలంగాణ సహా దేశవ్యాప్తంగా బీకాం డిగ్రీ కోర్సుకు గిరాకీ పెరుగుతున్నది. 2022-23 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో మొత్తం 2,10,970 డిగ్రీ సీట్లుంటే, అందులో 87,470 మంది విద్యార్థులు కామర్స్ కోర్సుల్లోనే చేరారు. అంటే 40 శాతంపైగా ఈ కోర్సును ఎంచుకొంటున్నారు. వచ్చే విద్యాసంవత్సరంలోనూ ఇదే ట్రెండ్ కొనసాగవచ్చని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
కామర్స్తో టెక్నాలజీ మేళవింపు
కామర్స్ కోర్సుల్లో ఇటీవలికాలంలో అనేక మార్పులు తెచ్చారు. కంప్యూటర్స్, టాక్సేషన్, ఆనర్స్, బిజినెస్ అనలిటిక్స్ వంటి కొత్త సబ్జెక్టులు తీసుకొచ్చారు. స్టాక్ మారెట్ ట్రెండ్ ను అంచనా వేసే కోర్సులను కూడా బీకాం కోర్సుల్లో అంతర్భాగం చేశారు. కామర్స్, గిగ్ ఎకానమీతో నిపుణుల అవసరమేర్పడగా, జీఎస్టీ తీసుకొచ్చిన తర్వాత టాక్స్ నిపుణులకు డిమాండ్ పెరిగింది. ఇందులోభాగంగా శనివారం ఓయూలోని కామర్స్ విభాగంలో బీకాం కోర్సుల్లో చేయాల్సిన మార్పులపై మేధోమథనం నిర్వహించారు. డిగ్రీ కాలేజీల అధ్యాపకులు ముఖ్యంగా కామర్స్ కోర్సులతో టెక్నాలజీని మేళవించే అంశంపై అన్ని వర్సిటీల బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్లు, ప్రొఫెసర్లు, ఇండస్ట్రీ నిపుణులతో చర్చించారు. అన్ని అంశాలు మేళవించిన కరికులం, సిలబస్ రూపకల్పనకు ప్రణాళికలు సిద్ధం చేశారు. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో కామర్స్ నేపథ్యం ఉన్న సిబ్బంది అవసరం పెరిగింది. ఏటా మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలోనే మన రాష్ట్రంలోనూ బీకాం కోర్సుల్లో మార్పులకు శ్రీకారం చుట్టారు. డిగ్రీ ప్రవేశాల్లో దాదాపు 40 శాతంపైగా బీకాం విద్యార్థులే ఉంటున్నారు. ఆరేండ్ల కిందట డిగ్రీలో 46 శాతం సైన్స్ విద్యార్థులు చేరితే, ఇప్పుడు ప్రవేశాలు 36 శాతానికి పడిపోయాయి. అదే బీకాంలో 2017- 18లో 80,776 మంది విద్యార్థులు చేరగా, 2022- 23కు వచ్చేసరికి 87,480 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు.
2017 నుంచి 2023 వరకు రాష్ట్రంలో బీకాం, బీఎస్సీ కోర్సుల ప్రవేశాలు
సంవత్సరం మొత్తం ప్రవేశాలు బీకాం బీఎస్సీ
2017- 18 2,00,806 80776 (40.23) 91,937 (45.78)
2018- 19 2,01,866 78842 (39.06) 90,786 (44.97)
2019- 20 2,02,342 80891 (39.98) 8,209 (41.12)
2020- 21 2,22,620 90,267 (40.55) 90,423 (40.61)
2021- 22 2,55,132 1,07,137 (41.99) 94,809 (37.16)
2022- 23 2,10,970 87,480 (41.47) 75,896 (35.98)