దేశంలో ఆహార ధాన్యాల కొరతకు కారణమేంటో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పాలి. దేశ ప్రజల ఆహార అవసరాలపై కనీస అవగాహన లేకపోవడం, ఆహార ధాన్యాల సేకరణలో కేంద్రానికి స్పష్టమైన విధానమంటూ లేకపోవడమే ప్రస్తుత దుస్థితికి కారణం.
-మంత్రి కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): ‘మా రైతులు యాసంగిలో భారీగా ధాన్యం పండించారు.. దయచేసి మొత్తం సేకరించండి.. అని అడిగితే, తెలంగాణ ప్రజలకు నూకలు తినటం నేర్పించండి అని అవమానించారు. ఇప్పుడు ఆ నూకలే కరువై దేశం నుంచి ఎగుమతి చేయకుండా నిషేధించారు. దీంతో నాడు తెలంగాణ ప్రజలను అవమానించిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు. ‘నూకల ఎగుమతిపై నిషేధం విధించినందున.. ఇప్పుడు పీయూష్ గోయల్ నూకలే తింటారా?’ అని శనివారం ఎద్దేవా చేశారు. తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపించాలనుకొన్న కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం, తాను తీసుకొన్న గోతిలో తానే పడిందని అన్నారు.
దేశంలో నాలుగేండ్లకు సరిపడా గోధుమలు, బియ్యం నిల్వలు ఉన్నాయని ఆరునెలల కింద గొప్పగా చెప్పుకొన్న కేంద్రం, ఇప్పుడు బియ్యం ఎగుమతులను నియంత్రించి.. 20 శాతం ఎగుమతి సుంకాన్ని విధించడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇప్పటికే గోధుములు, వాటి ఆధారిత ఉత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలు విధించిన కేంద్రం, తాజాగా నూకల ఎగుమతిపైనా నిషేధం విధించటం మోదీ సర్కారుకు ముందుచూపు లేదనటానికి నిదర్శనమని శనివారం విమర్శించారు. ‘తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆరు నెలల కిందటే తెలంగాణ ప్రభుత్వం కోరితే, దేశంలో అవసరానికంటే ఎకువ ఆహార నిల్వలు ఉన్నాయని చెప్పి ఆ విజ్ఞప్తిని కేంద్రం తిరసరించింది. ఇప్పుడు ఆహార ధాన్యాల కొరత ఉన్నదంటున్నది. కారణమేంటో మంత్రి గోయల్ చెప్పాలి. ప్రజల ఆహార అవసరాలపై, ధాన్యాల సేకరణలో స్పష్టమైన విధానం లేకపోవడమే దుస్థితికి కారణం’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ రైతులపై, రాష్ట్రంపై మోదీ సర్కారు చూపిన తీవ్రమైన వివక్ష కారణంగానే ఆహార కొరత ముంచుకొస్తున్నదని కేటీఆర్ అన్నారు. ప్రజల ఆహార అవసరాలపై మోదీ సరారుకు దీర్ఘకాలిక ప్రణాళిక లేదని ప్రస్తుత సంక్షోభంతో తేలిపోయిందని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు నూకలు తినిపించడం అలవాటు చేయాలని అవమానించిన పీయూష్ గోయల్, ఇప్పుడు నూకల ఎగుమతులను నిషేధించి వాటినే తింటారేమో అని ఎద్దేవా చేశారు.
రైతులు వరిపంట వేయకుండా ఇతర పంటల వైపు మళ్లించాలని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తెచ్చిన కారణంగానే గత వానకాలం సీజన్తో పోలిస్తే ఈసారి దేశవ్యాప్తంగా సుమారు 95 లక్షల ఎకరాల్లో వరిసాగు తగ్గిపోయిదని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ లోటు కోటి ఎకరాలు దాటే అవకాశం కూడా ఉన్నదని, దీంతో దేశవ్యాప్తంగా 12-15 మిలియన్ టన్నుల బియ్యం ఉత్పత్తి తగ్గిపోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. అందువల్లనే బియ్యం ఎగుమతులను కేంద్రం నియంత్రించిందని అన్నారు. దేశానికి సమగ్ర ఆహార ధాన్యాల సేకరణ విధానం లేకపోవడం మోదీ ప్రభుత్వ వైఫల్యమే అని విమర్శించారు. 140 కోట్ల జనాభా ఉన్న దేశానికి ఆహార భద్రత లేకపోవటం బీజేపీ ప్రభుత్వ హస్వ దృష్టికి నిదర్శనమని ధ్వజమెత్తారు.
ఇప్పటికైనా కేంద్రం ప్రజల సంక్షేమం, ఆహార భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. వ్యవసాయ రంగం, ఆహార అవసరాలపై స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్ పాలసీని అమలు చేయాలని తెలంగాణ ఎప్పటినుంచో కోరుతున్నదని గుర్తుచేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం ధాన్యం సేకరణలో స్పష్టమైన విధానాన్ని అమలుచేయకుండా రైతాంగాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నదని విమర్శించారు. ధాన్యాన్ని సేకరించకుండా రాజకీయాలకే ప్రాధాన్యం ఇవ్వడంతో దేశం ఆహార కొరత ముంగిట్లో నిలిచిందని మండిపడ్డారు. ఇప్పటికైనా రాజకీయాలను పకనపెట్టి, భారీగా ధాన్యం పండిస్తున్న తెలంగాణ లాంటి రాష్ట్రాల నుంచి పూర్తిస్థాయిలో ధాన్యాన్ని సేకరించి ఆహార భద్రతకు ఢోకా లేకుండా చూడాలని కోరారు.