హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): దేశం రక్షణ కోసం రక్తమాంసాలు ధారపోస్తున్న సైనికులు, వారి కుటుంబాలను ఆదుకోవడం మన విధి. అందుకు అవకాశం కల్పిస్తున్నదే ‘సాయుధ దళాల పతాక నిధి’. సైనికులకు సంఘీభావాన్ని ప్రకటించడంతోపాటు, మాజీ సైనిక కుటుంబాలకు పునరావాసాన్ని కల్పించేందుకు బుధవారం రాష్ట్రంలో ఈ నిధి సేకరణ ప్రారంభమైంది. ఏటా డిసెంబర్ 7న సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ రాజ్భవన్లో తన వంతు విరాళాన్ని అందజేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
హర్యానా గవర్నర్ దత్తాత్రేయతోపాటు హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, సీఎస్ సోమేశ్కుమార్ కూడా రాజ్భవన్లోనే ఈ నిధికి విరాళాలను అందజేశారు. పౌరులకు స్టిక్కర్లు, జెండాలను విక్రయించడతోపాటు హుండీల ద్వారా ఏడాదంతా విరాళాలు సేకరిస్తారు. ఏటా రూ.3 కోట్ల వరకు నిధి సమకూరుతుంది. నేరుగా విరాళం ఇవ్వాలనుకునేవారు ఆర్టీజీఎస్, నెఫ్ట్, చెక్కులు, డీడీల ద్వారా హైదరాబాద్లోని శాంతినగర్ ఎస్బీఐ శాఖలో ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్లాగ్డే ఫండ్ (ఏఎఫ్ఎఫ్డీ) అకౌంట్ నంబర్ 52188926279లో జమ చేయవచ్చు. అందుకు ఐఎఫ్ఎస్సీ కోడ్ SBIN002 0073, ఎంఐసీఆర్ కోడ్ 500004057ను ఉపయోగించాలి.
హైదరాబాద్ జిల్లా టాప్
రాష్ట్రంలో సాయుధ దళాల పతాక నిధి సేకరణలో హైదరాబాద్ జిల్లా అగ్రగామిగా నిలిచింది. రూ.10 లక్షలకుపైగా నిధిని సేకరించింది. దీంతో ప్రాంతీయ సైనిక సంక్షేమాధికారి నోరి శ్రీనేశ్కుమార్ గవర్నర్ నుంచి ట్రోఫీని అందుకున్నారు. హైదరాబాద్ వాసు లు 62076718524 అకౌంట్ నంబర్లో విరాళాన్ని జమచేయాలని శ్రీనేశ్ కోరారు.