హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం రానివ్వబోమని, ఇబ్బందులు తలెత్తితే వెంటనే సరిచేసేలా బ్రేక్డౌన్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు చెప్పారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాలతోపాటు హైదరాబాద్లోనూ బ్రేక్డౌన్ బృందాలను రంగంలోకి దింపినట్టు తెలిపారు. మూడురోజులుగా ఎడతెరపి లేకుండా భారీ, అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆయన రెండు డిస్కంల సీఎండీలు రఘుమారెడ్డి, గోపాలరావులతో మాట్లాడారు. అందరినీ అలర్ట్ చేశారు. జిల్లాలవారీగా ఎస్ఈలు, డీఈలను రౌండ్ ది క్లాక్ పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కాలనీలు, రహదారుల వెంట ఉన్న విద్యుత్తు స్థంభాలను తాకవద్దని సూచించారు.