Pharma City | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా పరిధిలో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం గత కొన్ని సంవత్సరాలుగా అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలన్నీ ఒక్కసారిగా నిలిచిపోయాయి. ఫార్మాసిటీ స్థానంలో మెగా టౌన్షిప్లతో కొత్త సిటీని ఏర్పాటు చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి కీలక నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. బుధవారం సీఎం నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకోవడం రంగారెడ్డి జిల్లా పరిధిలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం అక్కడ మెగాసిటీని ఏర్పాటు చేయాలని చూస్తుండగా.. ఎలాగూ ఫార్మాసిటీని రద్దు చేసినందున తమ భూములు తమకిస్తే బాగుంటుందని ఆ ప్రాంత రైతులు కోరుతున్నారు.
రంగారెడ్డి జిల్లా పరిధిలో దేశంలోనే అతి పెద్ద ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇబ్రహీంపట్నం, మహేశ్వరంతోపాటు కల్వకుర్తి నియోజకవర్గం పరిధిలోని కడ్తాల్ మండలంలో దాదాపు 19,400 ఎకరాల భూమిని సేకరించాలని గత ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. ఈ మేరకు భూసేకరణ ప్రకియను చేపట్టింది. అనంతరం కడ్తాల్ గ్రామ పరిధిలోని భూసేకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకొన్నది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని యాచారం మండలం మేడిపల్లి, నానక్నగర్, కుర్మిద, నక్కర్త, ముచ్చర్ల, సాయిరెడ్డిగూడెంతోపాటు మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండల పరిధిలోని ఉట్లపల్లి, పంజాగూడ, మీర్ఖాన్పేట, తిమ్మాయిపల్లి, మహ్మద్నగర్, కందుకూరు, సర్వరావులపల్లి తదితర గ్రామాల పరిధిలోని 14,300 ఎకరాలను సేకరించాలని నిర్ణయించారు.
ఇప్పటివరకు ఇందులో 12,300 ఎకరాల భూసేకరణ కూడా పూర్తవగా, ఇందులో సుమారు 9,400 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉన్నది. మిగిలిన పట్టా, అసైన్డ్ భూములకు ప్రభుత్వం పలు మార్గాల్లో పరిహారం ఇచ్చింది. పట్టా భూములు ఇచ్చిన వారికి ఎకరాకు రూ.18 లక్షలతో పాటు అభివృద్ధి చేసిన 121 గజాల ప్లాటు (ఒక గుంట), ఆ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది. కోర్టును ఆశ్రయించిన కొందరు రైతులకు ఎకరాకు గరిష్ఠంగా రూ.26 లక్షలు వచ్చాయి. అసైన్డ్ భూములు కోల్పోయినవారికి ఎకరాకు రూ.7.50-8.00 లక్షలు ప్రభుత్వం చెల్లించింది. వీరికి ఎకరాకు అభివృద్ధి చేసిన 121 గజాల ప్లాటుతోపాటు ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు నగదు పరిహారం గతంలోనే చెల్లించింది. సేకరించిన భూముల్లోనే 600 ఎకరాల మేర లేఅవుట్ను అభివృద్ధి చేసి, భూములు ఇచ్చిన వారికి ప్లాట్లను పంపిణీ కూడా చేశారు.
ప్రభుత్వం ఫార్మాసిటీని రద్దుచేస్తే ఆ భూములను తిరిగి రైతులకే ఇవ్వాలని ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి డిమాండ్ చేవారు. అధికారంలోకి వస్తే ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన రైతులకు ఆ భూములను తిరిగి ఇప్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఆ హామీని నిలబెట్టుకోవాలని కోరారు. ప్రభుత్వం ఫార్మాసిటీని రద్దుచేసి ఆ భూములను రియల్ఎస్టేట్ సంస్థలకు కట్టబెట్టి వ్యాపారం చేయాలని చూస్తున్నదని విమర్శించారు. ఈ ప్రాంత అభివృద్ధితోపాటు ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని గత ప్రభుత్వం పొల్యూషన్ రహిత ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తామంటే మెజార్టీ రైతులు ఒప్పుకుని భూములు ఇచ్చారని తెలిపారు. ప్రజల అభిప్రాయం మేరకే ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తామని గత ప్రభుత్వం ముందుకొచ్చిందని గుర్తుచేశారు.
ఫార్మాసిటీ రద్దు హర్షించదగిన విషయమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఫార్మాసిటీని వ్యతిరేకించిన సీఎం రేవంత్రెడ్డికి ఇబ్రహీంపట్నం ప్రజల తరుపున కృతజ్ఞతలు తెలిపారు. ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఫార్మాసిటీని ఏర్పాటుచేస్తే కాలుష్యంతో ఈ ప్రాంతమంతా తీవ్రంగా నష్టపోయే ప్రమాదమున్నందున ఫార్మాసిటీ పరిసర ప్రాంతాల్లోని మేడిపల్లి, తాటిపర్తి, నానక్నగర్, కుర్మిద్దతో పాటు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ప్రజలంతా ముక్తకంఠంతో వ్యతిరేకించారని అన్నారు. గత ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఫార్మాసిటీని రద్దుచేస్తామని ప్రకటించిన విధంగా తాము అధికారంలోకి రాగానే ఫార్మాసిటిని రద్దుచేసినట్టు వెల్లడించారు.
సీఎం రేవంత్రెడ్డి రెండు రోజుల కిందట నిర్వహించిన సమీక్షలో ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఇప్పటివరకు ఫార్మాసిటీ ఏర్పాటు కోసం చేపట్టిన చర్యలన్నీ నిలిచిపోయాయి. సీఎం నిర్ణయంతో అధికారులు ప్రక్రియలన్నింటినీ నిలిపివేసినట్టు తెలిసింది. ఫార్మాసిటీ కోసం ఇప్పటివరకు 12,300 ఎకరాల భూమిని సేకరించారు. ఆ భూముల్లో మెగా టౌన్షిప్ల నిర్మాణం చేపట్టాలని సీఎం రేవంత్రెడ్డి నిర్ణయించారు. దీనిపై ప్రభుత్వం ప్రణాళిక ప్రకటించాల్సి ఉన్నది. ప్రభుత్వ నిర్ణయంపై ఫార్మాసిటీ కోసం భూములిచ్చిన రైతుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం సేకరించిన తమ భూముల్ని తిరిగిచ్చేస్తే బాగుంటుందనే కోరుతున్నారు.
ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో టీఎస్ఐఐసీ విశాలమైన రహదారులు, భూగర్భ డ్రైనేజీ, ఇతరత్రా మౌలిక వసతుల కల్పనతో అభివృద్ధి పనులు చేశారు. కందుకూరు పరిధిలో 180 ఎకరాలు సబ్ స్టేషన్కు కేటాయించారు. కొన్నిరోజుల కిందట 30 ఎకరాలకు ప్రభుత్వ వైద్య కళాశాలకు కేటాయించారు. కాగా ప్రధానంగా 48 ఎకరాలను అమెజాన్ డాటా సెంటర్కు ఇచ్చారు. ఇందులో రూ.5,809 కోట్లతో డాటా సెంటర్ ఏర్పాటవుతున్నది. మిగిలిన భూముల్లో ఫార్మా కంపెనీల ఏర్పాటుకుగాను సుమారు 300-350 కంపెనీలు ముందుకొచ్చినట్టు అధికారులు తెలిపారు. ఆయా కంపెనీలకు భూ కేటాయింపులు చేసే ముందు తీసుకోవాల్సిన అనుమతుల ప్రక్రియను అధికారులు కొనసాగిస్తున్నారు. ఈ మేరకు పలు దఫాలుగా కాలుష్య నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. ఈ క్రమంలో 9,213 ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటుకు మొదటి దశ అనుమతుల్లో భాగంగా కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి గ్రీన్సిగ్నల్ కూడా వచ్చినట్టు తెలిసింది. సాధారణంగానైతే తుది దశ అనుమతులు రాగానే ముందుకొచ్చిన కంపెనీలకు భూ కేటాయింపులు చేస్తారు.