హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డి తెలివిగా ఆడిన రాజకీయ చదరంగంలో కోదండరాం త్రిశంకు స్వర్గం లో ఇరుక్కుపోయారు. ‘పదవి ఇచ్చినట్టు ఉండా లి.. కానీ అధికారంలో ఉండకూడదు’ అనే తరహాలో రేవంత్ వేసిన స్కెచ్కు కోదండరాంకు పంచ్ పడింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు కోదండరాంకు ఎమ్మెల్సీ ఇవ్వాలని, మంత్రి పదవి అప్పగించాలని వివిధ వర్గాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి వస్తున్నది. విద్యాశాఖ మంత్రి పదవి ఇస్తారంటూ ప్రచారం కూడా సాగుతున్నది. ఈ నేపథ్యంలో వీటన్నింటికీ రేవంత్రెడ్డి ఒకే ఎత్తుతో చెక్ పెట్టారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవుల భర్తీకి కేసీఆర్ ప్రభుత్వం నిరుడు ఆగస్టు 1న డాక్టర్ దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను ఖరారుచేసింది. ఆమోదం కోసం రాజ్భవన్కు పంపగా.. గవర్నర్ దాదాపు 55 రోజులు నిర్ణయం తీసుకోలేదు. వారిద్దరి పేర్లను సెప్టెంబర్ 25న తిరస్కరించారు. వారిద్దరూ రాజకీయ నేపథ్యం ఉన్నవారనే కారణంతో తిరస్కరిస్తున్నట్టు చెప్పారు. దీంతో వారు న్యాయస్థానా న్ని ఆశ్రయించారు. కోర్టులో తీర్పు వచ్చే వరకు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు సాధ్యం కాదని ప్రతి ఒక్కరికీ అర్థమైంది. కానీ, రేవంత్రెడ్డి ఇక్కడే తన రాజకీయ చతురతను ప్రదర్శించి కోదండరాంను అడ్డంగా ఇరికించేశారు. ‘రాజకీయంగా’.. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నట్టు చెప్పుకుంటూనే పదవిలోకి రాకుండా ‘సాంకేతికంగా’ అడ్డుకున్నారు. గత నెల రోజుల్లో జరిగిన పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.
కోర్టు తీర్పు వచ్చేవరకు ఎలాంటి కొత్త ప్రతిపాదనలు తీసుకోబోనని గవర్నర్ స్పష్టం చేశా రు. ఈ మేరకు న్యాయస్థానంతో ‘గౌరవ ఒప్పందం’ చేసుకున్నారు. ఈ నెల 24న జరిగిన వాదనల్లోనూ ‘కోర్టులో వివాదం తేలేదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని గవర్నర్ నిర్ణయించారు’ అని గవర్నర్ తరఫు న్యాయవాది ధర్మాసనానికి స్పష్టంచేశారు. దీనిని బట్టే.. కోర్టు తీర్పు వచ్చే వరకు ఎమ్మెల్సీ పదవులు చేపట్టడం అసాధ్యమని అర్థమైపోయింది. ఒకవేళ ఎవరినైనా నియమించినా న్యాయవివాదం తప్పదని తేలిపోయింది. కానీ కోదండరాంను ప్రభుత్వంలోకి తీసుకోవాలని వస్తున్న ఒత్తిడులను తప్పించుకోవడానికి రేవంత్ చక్రం తిప్పారని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. కేవలం ఒక్క రోజులోనే గవర్నర్ మాట మార్చి, ఇద్దరి పేర్లను ఖరారు చేయడ మే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ వివాదం హైకోర్టులో సమసిపోకుండా సుప్రీంకోర్టు వరకు వెళ్తే.. ఎప్పుడు పరిష్కారం అవుతుందో తెలియదు. కాబట్టి అప్పటి వరకు కోదండరాం పదవులకు దూరంగా ఉన్నట్టేనని స్పష్టం చేస్తున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని ఎమ్మెల్సీ పదవుల అంశంతో మరోసారి రుజువైందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. రాజకీయాలతో సంబంధం ఉన్నదనే కారణంతో దాసోజు, కుర్రా అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరస్కరించారని గుర్తుచేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ఐదుగురు రాజకీయ నేతలను ఎమ్మెల్సీలుగా నియమించారని చెప్తున్నారు. అలాంటిది ఏకంగా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడి పేరును ఎలా ఖరారు చేశారని ప్రశ్నిస్తున్నారు. రెండు పార్టీల మధ్య ఒప్పందానికి ఇది తొలి నిదర్శనమని విమర్శిస్తున్నారు. కోర్టు తీర్పు వచ్చే వరకు కొత్త ప్రతిపాదనలు తీసుకోబోమని ఈనెల 17న ప్రకటించిన గవర్నర్.. వారం వ్యవధిలోనే ఎందుకు మాట మార్చారని అడుగుతున్నారు. తీర్పు వచ్చేవరకు వేచి చూస్తామని ఈనెల 24న కూడా కోర్టులో చెప్పారని, 24 గంటల్లోనే ఇద్దరి పేర్లను ఎందుకు ఖరారుచేశారని ప్రశ్నిస్తున్నారు. ఇది కచ్చితంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య లోపాయకారి ఒప్పందానికి నిదర్శనమని చెప్తున్నారు.