CM KCR | కొల్లాపూర్ : ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గంపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. కొల్లాపూర్ పట్టణం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి రూ. 25 కోట్లు మంజూరు చేస్తున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. నార్లాపూర్ వద్ద పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభించిన అనంతరం కొల్లాపూర్లో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు.
కొల్లాపూర్ పట్టణానికి మంజూరు చేసిన ప్రత్యేక ఫండ్తో బ్రహ్మాండంగా మిగిలిన పనులన్నీ చేయాలని కోరుతున్నాను అని కేసీఆర్ తెలిపారు. కొల్లాపూర్కు ఒక ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని కూడా మంజూరు చేస్తాం. రెండు, మూడు లిఫ్టలు అడిగారు. జిల్ దార్ తిప్ప లిఫ్ట్, బాచారం హై లెవల్ కెనాల్, పసుపుల బ్రాంచ్ కెనాల్ వైడనింగ్, లైనింగ్, మల్లేశ్వరం మినీ లిప్ట్ కావాలని అడిగారు. అధికారుల చేత సర్వే చేయించి తప్పకుండా మంజూరు చేస్తాను. రూ. 10 కోట్లతో బోడగట్టు చెక్ డ్యాంకు రేపే జీవో ఇస్తాం. కొల్లాపూర్ వెనుకబడ్డ నియోజకవర్గం కాబట్టి.. ఈ రోజు ప్రకటిస్తున్నాను. సర్పంచ్లకు తీపి కబురు చెబుతున్నాను. కొల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామపంచాయతీకి రూ. 15 లక్షల చొప్పున ప్రత్యేక ఫండ్ మంజూరు చేస్తున్నాను. మంచి కార్యక్రమాలు చేపట్టాలి. మహబూబ్నగర్ పట్టణంలో పెద్దగా ఇంజినీరింగ్ కాలేజీలు లేవు. మహబూబ్నగర్ పట్టణంలో కూడా జేఎన్టీయూ ద్వారా ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు చేస్తాం. నన్ను ఎంపీగా చేసి, తెలంగాణను సాధించుకున్నాం. కాబట్టి.. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి 1000 ఇండ్ల చొప్పున ఎక్కువ ఇస్తాం. ఆర్డర్లు కూడా ఇచ్చాం. ఆ రకంగా నన్ను ఎంపీగా చేసి, తెలంగాణ సాధించేంత యోధుడిగా చేసినందుకు పాలమూరు ఎప్పుడు నా గుండెల్లో ఉంటుంది. భవిష్యత్లో కూడా మీ దీవెన ఉండాలని కోరుకుంటున్నాను అని కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.