హైదరాబాద్: ‘తెలంగాణ రాష్ట్ర సాధన జరిగినప్పుడే మేం ప్రకటించాం. ఇప్పటి వరకూ ప్రజాస్వామికంగా పోరాడేందుకు ఉద్యమపార్టీగా, రాజకీయపార్టీగా ఉన్నాం. ఇకనుంచి రాజకీయ చాణక్యం చూపిస్తాం. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకుంటాం’ అని అప్పుడే స్పష్టంగా ప్రకటించానని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
హైదరాబాద్ ప్రగతి భవన్లో ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాము రాజకీయ పార్టీగా ఉంటామని బహిరంగంగానే ప్రకటించానని, అంతేకానీ సీక్రెట్గా చీకట్లో చెప్పలేదని అన్నారు. అభిప్రాయాలు, ఆలోచనలు నచ్చిన వారు ఇతర పార్టీల నుంచి వచ్చి తమ పార్టీలో చేరతామంటే చేర్చుకుంటామని, దానిలో తప్పేముందని ప్రశ్నించారు.
అలా వచ్చిన వారు సీనియర్లు అయితే రాష్ట్రం కోసం వారి అనుభవాన్ని ఉపయోగించుకునేందుకు మంత్రి పదవులు ఇచ్చినా తప్పు లేదు కదా? అని అన్నారు. అలా చేయడమే తప్పని బీజేపీ భావిస్తే మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియాను బీజేపీలో ఎలా చేర్చుకున్నారని సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమీటి సభ్యుడిగా ఉన్న సింధియాను కేంద్ర మంత్రి వర్గంలో చేర్చుకోలేదా? అని నిలదీశారు. తాము చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారం అనే చందంగా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.