హైదరాబాద్: రాష్ట్రంలో మాదక ద్రవ్యాల( డ్రగ్స్ ) వాడకం అనే మాటే వినపడకుండా అత్యంత కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా డ్రగ్స్ వాడకాన్ని నియంత్రించేందుకు కఠిన చర్యలు చేపట్టే దిశగా ఈనెల 28 వ తేదీ శుక్రవారం ప్రగతిభవన్లో ‘స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్’ జరుపాలని సీఎం నిర్ణయించారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగనున్న ఈ సదస్సులో రాష్ట్ర హోం మంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి, సీఎస్, డీజీపీ, డీజీలు, అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు, డీసీపీ అధికారులతో పాటు రాష్ట్ర ఎక్సైజ్ పోలీస్ శాఖకు చెందిన ఎస్పీలు, సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వాడకాన్ని కఠినంగా నియంత్రించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ విధి విధానాలను ఈ సదస్సులో చర్చించనున్నారు. ఈమేరకు పోలీసు శాఖ, ఎక్సైజ్ శాఖ అధికార యంత్రాంగాన్ని మరింత అప్రమత్తం చేయనున్నాయి. రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగాన్ని నియంత్రించే దిశగా చేపట్టాల్సిన కఠిన చర్యలపై బుధవారం ప్రగతి భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎంవో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మాదక ద్రవ్యాల వినియోగంలో దోషులుగా తేలినవారు ఎంతటి వారైనా సరే కఠినంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అన్నారు. కఠిన చర్యల అమలుకై ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఇందుకు కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు వెయ్యి మందితో కూడిన ప్రత్యేకంగా ‘నార్కోటిక్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ సెల్’ (కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్) పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ ప్రత్యేక విభాగం రాష్ట్ర డీజీపీ ఆధ్వర్యంలో డ్రగ్స్, వ్యవస్థీకృత నేరాలను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవడం కోసం ప్రత్యేక విధులను నిర్వర్తించనుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.