CM KCR | రాష్ట్రంలోని ప్రతీ నిరుపేద బిడ్డ గొప్పగా చదువుకోవాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష. పేద పిల్లలందరూ గొప్ప చదువులు చదివి డాక్టర్లు, ఇంజినీర్లు కావాలన్నదే ఆయన కోరిక. అందుకే తెలంగాణలోని అన్ని వర్గాల పిల్లలకు నాణ్యమైన బోధనను అందించేందుకు సీఎం కేసీఆర్.. వెయ్యికి పైగా గురుకుల పాఠశాలలు, కాలేజీలను ప్రారంభించారు. ఈ గురుకులాల్లో పది లక్షల మంది చదువుకుంటున్నారు. ప్రయివేటు విద్యార్థులకు ధీటుగా గురుకుల విద్యార్థులు ఇంటర్, టెన్త్ ఫలితాల్లో మెరిసిపోతున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో ర్యాంకుల పంట పండిస్తున్నారు.
అయితే బీసీ రెసిడెన్షియల్ కాలేజీలో చదివి ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 470 మార్కులకు గానూ 468 మార్కులు సాధించిన హరిత అనే విద్యార్థినికి ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలిచారు. ఇచ్చిన మాట ప్రకారం ఆమెకు రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందించారు. కేసీఆర్ పంపించిన రూ. 5 లక్షల చెక్కును శనివారం మంచిర్యాల కలెక్టరేట్ భవనంలో జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్తో కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ హరితకు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్కు హరిత తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ఏడాది జూన్ 9వ తేదీన మంచిర్యాల జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా.. సీఎం కేసీఆర్ హరితను అభినందించిన విషయం తెలిసిందే. ఆమె ఉన్నత చదువులకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం చేస్తానని కేసీఆర్ మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం కేసీఆర్ చెక్కు పంపించారు. హరిత సొంతూరు చెన్నూరు నియోజకవర్గం పరిధిలోని మందమర్రి పట్టణం.