హైదరాబాద్ : ప్రముఖ సినీ హాస్య నటుడు పొట్టి వీరయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. విఠలాచార్య కాలం నుండి నేటి వరకు పలు భాషల్లోని దాదాపు 500 సినిమాల్లో నటించిన సూర్యాపేట జిల్లా ఫణిగిరికి చెందిన గట్టు వీరయ్య, తెలుగు సినీ ప్రేక్షకులను తన నటనతో అమితంగా అలరించారని సీఎం గుర్తు చేసుకున్నారు. వీరయ్య కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
గుండెపోటు రావడంతో వీరయ్యను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. 74 ఏండ్ల వయస్సున్న వీరయ్య పుట్టుకతోనే మరుగుజ్జు. ఎత్తు 2 అడుగులు. 1969లో ఎన్టీఆర్ నటించిన అగ్గిరాముడు చిత్రం ద్వారా నటనా కెరీర్ను ప్రారంభించారు.