హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి ప్రభు త్వం కట్టుబడి ఉన్నదని, ఈ నెల 22న రేషన్ డీలర్ల సంఘాలతో సమావేశం నిర్వహిస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ నేపథ్యంలో జూన్ లో తలపెట్టిన సమ్మె ఆలోచన విరమించుకోవాలని రేషన్ డీలర్లకు సూచించారు. గురువారం ఆయన రేషన్ డీలర్ల సమస్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ రేషన్ లబ్ధిదారులకు ఇబ్బంది రావొద్దని, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో ఏ ఒకరూ ఆకలితో అలమటించకూడదనే గొప్ప సంకల్పంతో కేసీఆర్ సరార్ పేదలకు రేషన్ పంపిణీ చేపడుతున్నదని తెలిపారు. దాదాపు ప్రతి నెల 90 లక్షల కార్డులకు 1.80 లక్షల టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నామని వివరించారు. ఇందుకోసం ప్రతి నెల రూ.298 కోట్లు, ఏటా రూ.3,580 కోట్లు ప్రభుత్వం ఖర్చుచేస్తున్నదని వెల్లడించారు. రాష్ట్రంలో 17,220కు పైగా రేషన్ దుకాణాలు ఉండగా.. ఆయా డీలర్లకు నెలకు రూ.12 కోట్ల పైచిలుకు కమీషన్ అందజేస్తున్నామని తెలిపారు.