హైదరాబాద్ : నాణ్యమైన ఉత్పత్తులు, సేవలను పొందడం పౌరుల హక్కు అని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల అన్నారు. వినియోగదారుల చట్టం- 2019పై వినియోగదారుల వ్యవహారాల శాఖ రూపొందించిన ప్రసార ప్రకటనలను సోమవారం హైదరాబాద్లోని మంత్రుల నివాసంలో ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినియోగదారులు వెచ్చించే ప్రతి పైసా సద్వినియోగం చేసే విధంగా వారికి నాణ్యమైన వస్తు, ఇతర సేవలు పొందేవిధంగా రాష్ట్రంలో వినియోగదారుల వ్యవహారాల శాఖ సిబ్బంది కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు.
1986 భారత వినియోగదారుల చట్టాన్ని సవరించి రూపొందించిన 2019 వినియోగదారుల చట్టం, వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందిస్తుందన్నారు. ఎవరైనా తమకు అందుతున్న సేవల్లో లోపాలు గమనించినా, ఇబ్బందులు పడ్డా వెంటనే శాఖని సంప్రదించాలన్నారు.
వినియోగదారుల సమస్యలపై వచ్చే ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకోవడంతో పాటు వారి హక్కులను మరింత సమగ్రంగా పరిరక్షిస్తుందన్నారు.
దీనికి సంబంధించిన ప్రచార చిత్రాలు ఇందుకు మరింత దోహదం చేస్తాయని మంత్రి గంగుల ఆకాంక్షించారు. కార్యక్రమంలో పౌరసరపరాల కమిషనర్ వి.అనిల్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, ఇతర శాఖాధికారులు పాల్గొన్నారు.