హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): ఆర్బీఐ గుర్తింపు పొందిన బ్యాంకుల్లోనే డబ్బులు దాచుకోవాలని సీఐడీ పోలీసు విభాగం అడిషనల్ డీజీ మహేశ్ భావగత్ సూచించారు. మెట్రోపాలిటిన్ సెషన్స్ జడ్జి ఆదేశాల మేరకు బుధవారం నాంపల్లి కోర్టులో కృషి బ్యాంకుకు చెందిన 23 మంది బాధితులకు సుమారు రూ.6,83,042 చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
మిగిలిన 100 మంది డిపాజిటర్లను గుర్తించి, సుమారు రూ.50 లక్షలు తిరిగి ఇచ్చే యత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. సికింద్రాబాద్లోని మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో కృషి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లిమిటెడ్ పేరుతో బ్యాంకును స్థాపించి, 2001లో బోర్డు తిప్పేశారు. ఈ కేసులో విచారణ చేపట్టిన తెలంగాణ సీఐడీ పోలీసులు, బాధితులను గుర్తించి డబ్బులు చెల్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ప్రేమావతి, రాధికాజైస్వాల్ తదితరులు పాల్గొన్నారు.